స్టాక్మార్కెట్లు : నేటి ట్రెండ్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసిన నేపథ్యంలో దీని ప్రభావం మన మార్కెట్లపై చూపనుంది. డౌ 280, ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ బలహీనంగా ముగిసాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా నెగిటివ్గా ప్రారంభమైనాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్పై అంచనాలను ఈ మార్కెట్లు ప్రభావితం చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి 300 బిలియన్ డాలర్ల విలువైన 10శాతం సుంకాలను విధించనున్నారు. చైనీస్ దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. మరోవైపు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బంగారం ధరలు పుంజుకున్నాయి. ఆయిల్ ధరలు పడిపోయాయి. డాలర్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ట్రేడింగ్ను ప్రారంభించే అవకాశం.
గమనించాల్సిన షేర్ల వివరాలు
ఫలితాలు : ఐటీసీ, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, బాటా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, తదితర సంస్థలు క్యూ1 ఫలితాలను ప్రకటించనున్నాయి. భారతి ఎయిర్టెల్ వ్యాపారం వృద్ది సాధించినప్పటికీ, 14 ఏళ్లలో తొలిసారి నష్టాలను నమోదు చేసింది. ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లను 5 బీపీస్ పాయింట్లు మేర పెంచింది. ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) పై ఆర్బీఐ కోటి రూపాయల పెనాల్టీ విధించింది. ఇంకా సిప్లా, జెట్ ఎయిర్వేస్, తల్వాల్కర్ హెల్త్ క్లబ్స్, కోల్ ఇండియా, జెకే టైర్స్ పై దృష్టి పెట్టాలి. రూపాయి బలహీన నేపథ్యంలో ఐటీ షేర్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యే అవకాశాలు. బ్యాంక్ నిఫ్టీ కదలికలు కీలకం. ప్రధానంగా ఎనలిస్టులు అమ్మకాలపై అంచనాలు వెలువరిస్తున్నారు.
కాగా గురువారం భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగిన స్టాక్మార్కెట్లు 760 పాయింట్ల మేర కుప్పకూలాయి. అయితే ఆఖరి గంటలో కోలుకున్న సెన్సెక్స్ , నిఫ్టీ భారీ నష్టాలతో కీలక మద్దతు స్థాయిలకు దిగువన ముగిసిన సంగతి తెలిసిందే.