లాభాల్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అయితే ప్రారంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా, మళ్లీ పుంజుకుంది. ఇలా ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్లు ఎగిసి 37119 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభంతో 10975 వద్ద కొనసాగుతున్నాయి.
చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాల అమలును భారీ డిమాండ్ రీత్యా కొంతకాలం వాయిదా వేసుకుంది. డిసెంబర్ మధ్య కాలం వరకు హాలిడే-షాపింగ్ జాబితాలో ఎక్కువగా ఉండే కొన్ని చైనా ఉత్పత్తులు ఫోన్లు, ల్యాప్టాప్లు , బొమ్మలు లాంటివాటిపై 10శాతం సుంకం విధింపును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.
బ్యాంకింగ్ లాభపడుతుండగా, ఫార్మ నష్టపోతోంది. మిడ్ క్యాప్స్ షేర్లు లాభపడుతున్నాయి. యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, రిలయన్స్, వేదాంతా, యాక్సిస్ బ్యాంకు, అపోలో హాస్పిటల్ లాభపడుతున్నాయి. డా రెడ్డీస్, యస్బ్యాంకు, సన్ఫార్మ, పవర్ గ్రిడ్, ఐవోసీ భారీగా నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో రుపీ భారీగా ఎగిసింది. మంగళవారం నాటి ముగింపు 71.40 తో పోలిస్తే 40 పైసలు ఎగిసి 71 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే క్రూడ్ ఆయిల్కూడా లాభపడింది.