పాలసీకి ముందు లాభాల స్వీకరణ

Stock Markets Close With Loss - Sakshi

స్వల్పంగా తగ్గిన రూపాయి

నష్టపోయినా, కీలక స్థాయిల ఎగువునే సెన్సెక్స్, నిఫ్టీలు

184 పాయింట్లు తగ్గి 40,084కు సెన్సెక్స్‌

67 పాయింట్లు పతనమై 12,022కు నిఫ్టీ

నేడు మార్కెట్‌కు సెలవురంజాన్‌ సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు.

ఆర్‌బీఐ పాలసీకి ముందు ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చేయడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. సోమవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లను సాధించిన విషయం తెలిసిందే. సూచీల ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌ల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకున్నప్పటికీ, సెన్సెక్స్‌ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్ల ఎగువునే ముగిశాయి. సెన్సెక్స్‌ 184 పాయింట్లు నష్టపోయి 40,084 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 12,022 పాయింట్ల వద్ద ముగిశాయి.  డాలర్‌తో రూపాయి మారకం స్వల్పంగా నష్టపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఐటీ, వాహన, బ్యాంక్‌ రంగ షేర్లు నష్టపోయాయి. క్యాపిటల్‌ గూడ్స్, లోహ, టెలికం షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

281 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సమీప భవిష్యత్తులో ఆర్‌బీఐ పాలసీని బట్టే మార్కెట్‌ గమనం ఉంటుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ఎనలిస్ట జయంత్‌ మాంగ్లిక్‌ వ్యాఖ్యానించారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం నిమిత్తం చర్చలు, ముడి చమురు ధరల కదలికలు కీలకమని పేర్కొన్నారు. సెన్సెక్స్‌ నష్టాల్లో ఆరంభమైనా ఉదయం పదిగంటల వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో ఏ స్థాయిలోనూ కోలుకోలేకపోయింది. సెన్సెక్స్‌ ఒక దశలో 44 పాయింట్లు లాభపడగా, మరో దశలో 237 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా   281 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి.

ఆల్‌టైమ్‌ హైకి యాక్సిస్‌ బ్యాంక్‌ ....
స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.826ను తాకింది. చివరకు 1.1 శాతం లాభంతో రూ.821 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్‌తో పాటు మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.141ను తాకింది. ఈ ఏడాది ఈ షేర్‌ ఇప్పటిదాకా 50 శాతానికి పైగా ఎగసింది. ఈ షేర్లతో పాటు 70కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బజాజ్‌ ఫైనాన్స్‌ , డీసీబీ బ్యాంక్, టైటాన్, హావెల్స్‌ ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇంద్రప్రస్థ గ్యాస్, ముత్తూట్‌ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, ట్రెంట్, అదానీ గ్యాస్, ఎంబసీ ఆఫీస్‌ రీట్‌ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.40,000 కోట్ల మేర మూలధన నిధులు అందించే అవకా శాలున్నాయని, ఈ మేరకు జూలై 5న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రకటన ఉండొచ్చన్న వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీఓ@ రూ.5,189 కోట్లు
లండన్, నైజీరియా ఎక్సే్చంజ్‌ల్లో లిస్టింగ్‌ !

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ, ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా కనీసం రూ.5,189 కోట్లు(75 కోట్ల డాలర్లు) సమీకరించనున్నది. నైజీరియా స్టాక్‌ ఎక్సే్చంజ్‌తో పాటు, లండన్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో కూడా ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా  కంపెనీని లిస్టింగ్‌ చేయాలనుకుంటున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఇక్కడి స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీఓ ద్వారా కనీసం 75 కోట్ల డాలర్లు సమీకరించనున్నామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అదనంగా సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తే,  15 శాతం మేర అదనపు నిధులను కూడా సమీకరిస్తామని వివరించింది. ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియో గిస్తామని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top