ఆగని రికార్డ్ల జోరు
రికార్డ్ స్థాయిల్లో లాభాల స్వీకరణ
చివరి గంట వరకూ నష్టాల్లోనే సూచీలు
ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్ షేర్లలో క్షీణత
ద్రవ్యలోటు వెల్లడి తర్వాత పుంజుకున్న కొనుగోళ్లు
ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త శిఖరాలకు సూచీలు
112 పాయింట్లు పెరిగి 37,607కు సెన్సెక్స్
37 పాయింట్ల లాభంతో 11,357కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్లో రికార్డ్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. మధ్యాహ్నం నష్టాలను రికవరీ చేసుకొని మరీ స్టాక్ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. చివరి గంటలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, హీరో మోటొకార్ప్ షేర్లలో కొనుగోళ్ల జోరుగా జరగడం కలసివచ్చింది. వరుసగా ఏడో రోజూ సెన్సెక్స్, వరుసగా నాలుగో రోజూ నిఫ్టీ రికార్డ్లను కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 37,607 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,357 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,645 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,366 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఐటీ, ఇంధన, లోహ, ఫార్మా షేర్లు లాభపడగా, ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు క్షీణించాయి. కాగా జూలై నెలలో సెన్సెక్స్ 6 శాతం ఎగసింది.
346 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్: అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో మన మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ట్రేడింగ్లో చాలా భాగం స్టాక్ సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు నష్టపోయి 37,299 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే డాలర్తో రూపాయి మారకం పుంజుకోవడం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, సానుకూల ద్రవ్యలోటు గణాంకాలతో స్టాక్ సూచీలు చివరి గంటలో మళ్లీ లాభాల బాట పట్టాయి. మొత్తం మీద సెన్సెక్స్ 346 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆర్థిక ఫలితాలు బాగుండటంతోయాక్సిస్ బ్యాంక్ ఇంట్రాడేలో 3% లాభంతో రూ.585కు దూసుకుపోయింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 3.2% నష్టంతో రూ.550 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్రూ.4,709 కోట్లు తగ్గి రూ.1,41,265 కోట్లకు చేరింది. నికర లాభం 43 శాతం పెరగడంతో డీ మార్ట్ రిటైల్ చెయిన్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్షేర్ ఆల్టైమ్ హై, రూ.1,664ను తాకింది.