ప్రతి 4 గంటలకు ఒక ఇంటి దొంగ!
బ్యాంకింగ్లో కొందరు ఉద్యోగుల అవినీతి
మూడున్నరేళ్లలో రూ.66వేల కోట్లకు కన్నం
భారీ మోసాల్లో సిబ్బంది పాత్ర
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల్లో వెల్లడి
భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా భావిస్తున్న బ్యాంకింగ్లో లొసుగులకు సంబంధించి వస్తున్న గణాంకాలు యావత్తు జాతినీ నివ్వెరపరుస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) చోటుచేసుకున్న దాదాపు రూ.11,400 కుంభకోణం తరువాత భారత బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న మోసాలపై పరిశీలకులు, విశ్లేషకులు మరింతగా దృష్టి పెట్టారు. బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూపొందించిన గణాంకాల ప్రకారం... ఇక్కడ సగటున ప్రతి 4 గంటలకూ ఒక ఇంటిదొంగ బయటపడుతున్నాడు. అంతేకాదు!! గడిచిన మూడున్నరేళ్లలోనే ఉద్యోగుల తాలూకు మోసాల వల్ల ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ఏకంగా రూ.66వేల కోట్లకుపైగా నష్టపోయాయి. ఆ వివరాలు చూస్తే...
సిబ్బంది ప్రమేయంతో...
►2013 ఏప్రిల్ నుంచి జూన్ 2016 మధ్య ఉద్యోగుల ప్రమేయంతో జరిగిన మోసాల సంఖ్య (రూ. లక్ష ఆపైన) 1,232. దీనివల్ల బ్యాంకులు రూ.2,450 కోట్లు నష్టపోయాయి.
►కేసుల్లో మహారాష్ట్ర సహా దక్షిణాది రాష్ట్రాల వాటా 49 శాతం. అయితే మోసం విలువలో చూస్తే 19 శాతమే.
►కేసుల విషయంలో కేవలం 3 శాతం ఉన్న (38) రాజస్థాన్, విలువ రూపంలో మాత్రం 44 శాతం (రూ.1,096 కోట్లు) ఉంది.
►రూ. లక్ష దిగువన కేసులను పరిగణనలోకి తీసుకోలేదు.
మోసం.. శిక్ష...!
►సగటున ప్రతి నాలుగు గంటలకు కనీసం ఒక బ్యాంకర్ ‘మోసం’ లావాదేవీతో పట్టుబడుతున్నాడు. శిక్షకు గురవుతున్నాడు.
►ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసానికి సంబంధించి 2015 జనవరి 1– 2017 మార్చి 31 మధ్య దాదాపు 5,200 అధికారులకు శిక్ష పడింది. జరిమానాలు వేయటం, సేవల నుంచి డిస్మిస్ చేయటం వంటివి కూడా జరిగాయి.
►బ్యాంకుల పరంగా చూస్తే, మోసాలకు సంబంధించి శిక్షకు గురయిన బ్యాంకుల్లో ఎస్బీఐది మొదటి స్థానం. ఇక్కడ ఈ తరహా మోసాలకు పాల్పడిన అధికారుల సంఖ్య 1,538.
►తరువాతి స్థానాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (449), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (406)లు ఉన్నాయి.
►ఇదే కాలంలో మోసపూరిత లావాదేవీలకు సంబంధించి 184 మంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు శిక్షకు గురయ్యారు.
దృష్టి పెట్టడం లేదు...
మోసాలను నిరోధించడానికి బ్యాంకులు బయటివైపే చూస్తుంటాయి. దీనికే అధిక సమయం కేటాయిస్తుంటాయి. నెట్వర్క్ అంతటా రిస్క్ను తగ్గించుకోవటం, నివారించటం వంటి చర్యలపై అసలు దృష్టి పెట్టడం లేదు.
– సంజయ్ కౌశిక్, ఎండీ, నెట్రికా కన్సల్టింగ్
బాసిజం తీవ్రత...
ఒక నిర్ణయం పట్ల పలు దశల్లో పరిశీలన అవసరం. అయితే భారత్ బ్యాంకుల్లో ఇది కనిపించదు. ఇక్కడ బాసిజం ఎక్కువ. ఒక మేనేజర్ ఒక నిర్ణయం తీసుకున్నాడూ అంటే, దిగువ స్థాయిల్లో ఇక ఎవ్వరూ దీనిని ప్రశ్నించరు. బ్యాంకింగ్ నిర్వహణలో ఇది తగదు.
– బికాశ్ గంగాధరన్, బ్యాంకింగ్ నిపుణులు
గుర్తించడంలోనే లోపం...
ఇబ్బంది ఎక్కడుంది? వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంలోనే బ్యాంకింగ్లో లోపం ఉంది. దీనివల్ల జరిగిన తప్పుకు ఎవరిని బాధ్యులను చేయాలో అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడుతుంది. నిర్వహణ మెరుగుపడాలి.
– టోబే సిమన్, సినర్జియా ఫౌండేషన్
మొండి బకాయిలు...
మొండి బకాయిల సమస్య ప్రభుత్వ బ్యాంక్లను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. ళ గత ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం రుణాల్లో 10.2 శాతంగా ఉన్న మొండి బకాయిలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 11.1 శాతానికి చేరతాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ప్రభుత్వ ఇటీవలి చర్యలు కొంత ఊరట కలిగించినప్పటికీ తాజా పీఎన్బీ స్కామ్ వ్యవహారం సమస్యను మళ్లీ మొదటికి తెచ్చింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు