నిఫ్టీకి నేడు 9809-9736 వద్ద సపోర్ట్‌!

SGX Nifty indicates Market may open weak - Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు డౌన్‌

బుధవారం యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో వీక్‌ ట్రెండ్‌

నేడు (గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు క్షీణించి 9,789 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 9,850 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఆరు రాష్ట్రాలలో తిరిగి కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ డీలాపడగా.. నాస్‌డాక్‌ స్వల్పంగా బలపడింది. యూరోపియన్‌ మార్కెట్లు మాత్రం 0.9-0.2 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే  ప్రస్తుతం ఆసియాలో థాయ్‌లాండ్‌ మినహా మిగిలిన మార్కెట్లన్నీ నేలచూపులతో కదులుతున్నాయి. సరిహద్దులో చైనాతో సైనిక వివాదం నేపథ్యంలో నేడు మరోసారి దేశీయంగా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభంకానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని తెలియజేశారు. 

ఆటుపోట్ల మధ్య వీక్‌
వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో సైనిక వివాదం తలెత్తడంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్యే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 33,508 వద్ద నిలవగా.. నిఫ్టీ 33 పాయింట్లు నీరసించి 9,881 వద్ద ముగిసింది. ఓవైపు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరోపక్క చైనాతో లడఖ్‌ సమీపంలో వివాదం కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 33,934 వద్ద గరిష్టాన్ని చేరగా.. 33,333 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ సైతం 10,004- 9,834 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  9,809 పాయింట్ల వద్ద, తదుపరి 9,736 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,979 పాయింట్ల వద్ద, ఆపై  10,076 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 19,911 పాయింట్ల వద్ద, తదుపరి 19,620 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,560 పాయింట్ల వద్ద, తదుపరి 20,919 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 487 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 168 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1479 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  డీఐఐలు రూ. 1162 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top