నేడు నేలచూపుతో మార్కెట్ల ఓపెనింగ్!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 46 పాయింట్లు డౌన్
మే నెలలో యూఎస్ రిటైల్ సేల్స్ అప్
2% లాభపడ్డ యూఎస్ మార్కెట్లు
యూరోపియన్ మార్కెట్లు 3 శాతం ప్లస్
ఇటూఇటుగా ఆసియా మార్కెట్లు
నేడు (బుధవారం) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.35 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 9,839 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జూన్ నెల ఫ్యూచర్స్ 9,885 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మే నెలలో రిటైల్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం ఎగశాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు మరింత అధికంగా 3.5-3 శాతం మధ్య జంప్చేశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. సరిహద్దులో చైనాతో సైనిక వివాదం నేపథ్యంలో నేడు దేశీయంగా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభంకానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని తెలియజేశారు.
రోలర్ కోస్టర్ రైడ్
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యలో అమ్మకాల ఒత్తిడితో దెబ్బతిన్నాయి. తిరిగి మిడ్సెషన్ నుంచీ ఊపందుకుని చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 33,605 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం లాభాల సెంచరీ చేసి 9,914 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ ఎగసింది. 34,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 34,022ను తాకింది. తదుపరి అమ్మకాల ఒత్తిడిలోపడి 33,000 పాయింట్ల దిగువన 32,953కు జారింది. ఇది 250 పాయింట్ల నష్టంకాగా.. ఇంట్రాడేలో 1,000 పాయింట్ల పరిధిలో ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 9,746 పాయింట్ల వద్ద, తదుపరి 9,579 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,064 పాయింట్ల వద్ద, ఆపై 10,214 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 19,656 పాయింట్ల వద్ద, తదుపరి 19,016 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,788 పాయింట్ల వద్ద, తదుపరి 21,279 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1479 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1162 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 2960 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1076 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.