నేడు గ్యాప్డౌన్తో మార్కెట్ల ఓపెనింగ్!
నిఫ్టీకి 10207-10109 వద్ద సపోర్ట్స్!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 118 పాయింట్లు పతనం
యూఎస్, యూరోపియన్ మార్కెట్లు మైనస్
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నేలచూపులతో
నేడు జూన్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగింపు
నేడు (25న) దేశీ స్టాక్ మార్కెట్లు పతనం(గ్యాప్డౌన్)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 118 పాయింట్లు పడిపోయి 10,181 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జూన్ నెల ఫ్యూచర్స్ 10,299 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. రెండో దశ కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది దాదాపు 5 శాతం క్షీణించనున్నట్లు ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసింది. అంతేకాకుండా న్యూయార్క్, న్యూజెర్సీ తదితర పలు రాష్ట్రాలలో మరోసారి లాక్డవున్ విధించవచ్చన్న అంచనాలు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా యూఎస్ మార్కెట్లు బుధవారం 2-3 శాతం స్థాయిలో నీరసించాయి. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు సైతం 3-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు నేలచూపుతో కదులుతున్నాయి.నేడు జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రోజుల ర్యాలీకి బ్రేక్
మిడ్సెషన్లో ఉన్నట్టుండి తలెత్తిన అమ్మకాలు చివరివరకూ పెరుగుతూ పోవడంతో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలను వీడి నష్టపోయాయి. సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయి 34,869 వద్ద ముగిసింది. తద్వారా 35,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరగా.. నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించి 10,305 వద్ద నిలిచింది. నిజానికి వరుసగా నాలుగో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్ గరిష్టంగా 35,706ను అధిగమించింది. తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో 34,795 దిగువకు చేరింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,207 పాయింట్ల వద్ద, తదుపరి 10,109 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,478 పాయింట్ల వద్ద, ఆపై 10,651 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,016 పాయింట్ల వద్ద, తదుపరి 20,604 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,159 పాయింట్ల వద్ద, తదుపరి 22,891 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐలు భేష్
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1767 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1525 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 169 కోట్లు, డీఐఐలు రూ. 454 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.