మార్కెట్లు బేర్- ఈ 2 స్టాక్స్.. స్పీడ్
సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం
118 పాయింట్లు జారిన నిఫ్టీ
బీఎఫ్ యుటిలిటీస్ 10 శాతం అప్
5పైసా క్యాపిటల్ 5 శాతం ప్లస్
ప్రపంచ దేశాలను నిరంతరంగా వణికిస్తున్న కోవిడ్-19 దెబ్బకు దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. దీనికితోడు సోమవారం యూఎస్ మార్కెట్లు వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ప్రతికూల ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 401 పాయింట్లు పతనమై 36,293ను తాకగా.. నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 10,685 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా బీఎఫ్ యుటిలిటీస్, 5పైసా క్యాపిటల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..
బీఎఫ్ యుటిలిటీస్
డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ 4.91 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో మౌలిక సదుపాయాల కంపెనీ బీఎఫ్ యుటిలిటీస్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 20 ఎగసి రూ. 221 సమీపంలో ఫ్రీజయ్యింది. జూన్ చివరికల్లా కళ్యాణి గ్రూప్ కంపెనీ బీఎఫ్ యుటిలిటీస్ ఈక్విటీలో.. ఎవెన్యూ సూపర్మార్ట్స్ అధినేత రాధాకిషన్ దమానీ 1.3 శాతం వాటాను కలిగి ఉన్నట్లు షేర్ హోల్డింగ్ డేటా వెల్లడించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన అర్ధగంటలోనే ఈ కౌంటర్లో7.2 లక్షల షేర్లు చేతులు మారాయి.
5పైసా క్యాపిటల్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించడంతో 5పైసా క్యాపిటల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 15.5 ఎగసి రూ. 325 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కంపెనీ రూ. 3.75 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 0.55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 85 శాతం పెరిగి రూ. 42 కోట్లను అధిగమించింది. 2016 మార్చిలో 5పైసాను ప్రవేశపెట్టాక తొలిసారి కంపెనీ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. గత నెల రోజుల్లో ఈ షేరు 99 శాతం ర్యాలీ చేయడం విశేషం!
మరిన్ని వార్తలు