లాభాల స్వీకరణ.. చమురు సెగ
152 పాయింట్ల నష్టంతో 33,219కు సెన్సెక్స్
47 పాయింట్లు పతనమై 10,303కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ నష్టాలు రెండో రోజూ కొనసాగాయి. లోహ, ఆయిల్, గ్యాస్, టెలికం, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరగడంతో స్టాక్ సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 33,219 పాయింట్ల వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు క్షీణించి 10,303 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడంతో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పెరుగుతాయనే ఆందోళన కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని నిపుణులు పేర్కొన్నారు.
327 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..: సెన్సెక్స్ 33,417 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. విదేశీ పెట్టుబడుల జోరుతో ఇంట్రాడేలో 33,485 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగసింది. చివర్లో లాభాల స్వీకరణ కారణంగా 33,158 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంటే ఒక దశలో 114 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 213 పాయింట్లు నష్టపోయింది. 327 పాయింట్ల రేంజ్లో కదలాడింది.
కన్సాలిడేషన్..!: చమురు ధరలు పెరుగుతుండటంతో, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటులు పెరుగుతాయనే ఆందోళనతో ఇన్వెస్టర్లు స్టాక్స్లో పెట్టుబడులకు సంకోచిస్తున్నారని, దీంతో మార్కెట్లో కన్సాలిడేషన్ చోటు చేసుకుంటోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్(హెడ్) వినోద్ నాయర్ చెప్పారు. కంపెనీల క్యూ2 ఫలితాలు మిశ్రమంగా ఉండడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. మరోవైపు ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం పెద్దగా ప్రభావం చూపలేదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.
మరిన్ని వార్తలు