హమ్మయ్య: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు

Sensex rebounds 200 pts, Nifty above 10,500 - Sakshi

ముంబై : అమెరికా స్టాక్‌ మార్కెట్ల దెబ్బకు గత వారం భారీగా పతనమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. భారీ అమ్మకాల ఒత్తిడి నుంచి విముక్తి పొంది, ఒక్కసారిగా పైకి ఎగిశాయి. 200 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌, 34,217.78 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 69 పాయింట్ల లాభంలో 10,524 వద్ద ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 243 పాయింట్ల లాభంలో 34,248 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంలో 10,528 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ కూడా ట్రేడింగ్‌ ప్రారంభంలో ఒక శాతం మేర లాభపడింది. నాల్కో, ఆయిల్‌ ఇండియా, బాటా ఇండియా, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, అమర రాజ బ్యాటరీస్‌ 3 నుంచి 7 శాతం మేర ర్యాలీ కొనసాగిస్తున్నాయి.

మణప్పురం ఫైనాన్స్‌, అశోక్‌ లేల్యాండ్‌, కాడిలా హెల్త్‌కేర్‌లు కూడా 2-5 శాతం లాభపడుతున్నాయి. మొండిబకాయిల దెబ్బకు డిసెంబర్‌ క్వార్టర్‌లో భారీగా నష్టాలను మూటకట్టుకున్న ఎస్‌బీఐ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 4 శాతం మేర నష్టపోయింది. కాగ, గతవారం గ్లోబల్‌ మార్కెట్లు ఇచ్చిన దెబ్బకు దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.3,838 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం జోరందుకున్నట్లు తెలిపారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసల నష్టంలో 64.28గా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top