నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో పాటు, ట్రేడ్ వార్ ఆందోళనలు పెరగడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 123 పాయింట్ల నష్టంలో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రస్తుతం 163 పాయింట్ల నష్టంలో 33,522 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 45 పాయింట్ల నష్టంలో 10,315 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్క్యాప్ మాత్రమే స్వల్పంగా 23 పాయింట్లు పెరిగింది. ప్రారంభంలో జై ప్రకాశ్ అసోసియేట్స్ 15 శాతం ర్యాలీ జరిపింది.
బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, ఎస్బీఐ, పీఎన్బీలు నష్టాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా షేరు కూడా 6 శాతం కిందకి పడిపోయింది. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.