రెండో రోజూ జోరందుకున్న మార్కెట్లు
ముంబై : గురువారం ట్రేడింగ్లో చెలరేగిపోయిన స్టాక్ మార్కెట్లు, శుక్రవారం సైతం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఓపెనింగ్లోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ సైతం 11 వేల మార్కుకు పైననే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంలో 36, 678 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంలో 11,055 వద్ద ట్రేడవుతున్నాయి. మెజార్టీ సూచీలు గ్రీన్గానే లాభాలు పండిస్తున్నాయి. ఎనర్జీ, మెటల్ స్టాక్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి. ఫైనాన్సియల్ స్టాక్స్లో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మిడ్క్యాప్స్ సైతం లాభాల్లోనే ఉన్నాయి. ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా కరెక్షన్కు గురికావడంతో, నేడు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చాలా బలంగా ట్రేడవుతున్నాయి.
ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ షేర్లు పైకి పెరిగాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇన్ఫోసిస్ లాభాల్లో నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్వార్ నుంచి కాస్త ఉపశమనం తీసుకున్న వాల్స్ట్రీట్ రాత్రికి రాత్రే జోరందుకుంది. టెక్నాలజీ స్టాక్స్ రికార్డు స్థాయిలను తాకడంతో, అమెరికా మార్కెట్లు భారీగా పెరిగాయి. ఆపిల్, ఆల్ఫాబెట్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. డోజోన్స్ 224 పాయింట్లు ఎగసి 24,925 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 24 పాయింట్లు పెరిగి 2,798 వద్ద.. నాస్డాక్ మరింత అధికంగా 107 పాయింట్లు జంప్చేసి 7,824 వద్ద ముగిసింది. వాల్స్ట్రీట్ జోరందుకోవడంతో, ఆసియన్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 20 పైసలు బలపడి 68.37వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని వార్తలు