బ్యాంకుల జోరు : ఐటీ బేజారు
35 వేలకు సమీపంలో సెన్సెక్స్
10300 ఎగువన ముగిసిన నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ముగిసాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు ఎగిసింది. చివరకు 180 పాయింట్ల లాభంతో 34911 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు ఎగిసి 10311వద్ద పటిష్టంగా ముగిసింది. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి, తద్వారా సెన్సెక్స్ 35 వేల సమీపానికి చేరగా, నిఫ్టీ 10300 ఎగువన ముగియడం విశేషం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ షేర్లు భారీ లాభాలనార్జించాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల లాభాలతో నిఫ్టీ బ్యాంకు 3 శాతానికిపైగా ఎగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ , కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలకు మార్కెట్ కు భారీ మద్దతునివ్వగా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీగా లాభపడ్డాయి. వర్క్ వీసాలపై కొత్త ఆంక్షలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించగా, కరోనా డ్రగ్ లాంచింగ్ నేపథ్యంలో ఫార్మ రంగ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. విప్రో, గ్రాసిమ్, హిందాల్కో, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.