మోదీ ప్రభంజనం : మార్కెట్లు జూమ్
సాక్షి, ముంబై : సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. తద్వారా మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 672 పాయింట్లు దూసుకెళ్లి 39,790 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం లాభాల డబుల్ సెంచరీ చేసింది. ప్రస్తుతం 200 పాయింట్లు లాభంతో 11,931 వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాలూ లాభాల్లో దూసుకుపోతున్నాయి.
సగానిగా పై మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఎన్డీఏ తిరిగి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమంటున్న ఫలితాల సరళితో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 3.5-1.5 శాతం మధ్య పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ, మీడియా, రియల్టీ, ఆటో రంగాలూ జోరు చూపుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, ఐబీ హౌసింగ్, జీ, ఎస్బీఐ, యస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్గ్రిడ్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 6.2-2.6 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో ఒక్క షేరూ ప్రస్తావించదగ్గ స్థాయిలో నష్టపోకపోవడం విశేషం! అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండియా సిమెంట్స్, భారత్ ఫైనాన్స్, అదానీ పవర్, బీవోబీ, ఆర్పవర్, సన్ టీవీ, దివాన్ హౌసింగ్ 8-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. టొరంట్ ఫార్మా, యూబీఎల్ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి.