10,800 పైకి నిఫ్టీ
ట్రంప్–కిమ్ భేటీతో లాభాలు
ఫార్మా షేర్ల జోరు
నాలుగు నెలల గరిష్టానికి సూచీలు
209 పాయింట్లు పెరిగి 35,693కు సెన్సెక్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య మంగళవారం సింగపూర్లో జరిగిన శిఖరాగ్ర సమావేశం మార్కెట్లకు సానుకూల సంకేతాలిచ్చింది. ఫలితం... మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వరుసగా రెండో రోజూ లాభపడిన స్టాక్ సూచీలు ఏకంగా నాలుగు నెలల గరిష్టానికి చేరాయి.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 35,693 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 10,843 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల పతనం కారణంగా ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.
ఇక అందరి కళ్లూ ‘ఫెడ్’పైనే...: లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా ఆదే జోరు చూపించింది. కొనుగోళ్లు వెల్లువెత్తడంతో 260 పాయింట్ల లాభంతో 35,743 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ ఇంట్రాడేలో 70 పాయింట్ల లాభంతో 10,857 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. కీలకమైన ట్రంప్–కిమ్ల భేటీ ముగియడంతో ఇక ఇప్పుడు అందరి కళ్లూ బుధవారం జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై ఉన్నాయి.
అవెన్యూ సూపర్మార్ట్స్@ లక్ష కోట్లు
డి–మార్ట్ రిటైల్ చెయిన్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లను తాకింది. ఈ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,606 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,00,197 కోట్లకు ఎగసింది.
మార్కెట్ క్యాప్ పరంగా టాటా మోటార్స్, బజాజ్ ఆటో తదితర బ్లూ చిప్ కంపెనీలను అధిగమించి 30వ అతి పెద్ద కంపెనీగా అవెన్యూ కంపెనీ అవతరించడం గమనార్హం. టాప్ 30లో స్థానం సాధించిన తొలి రిటైల్ కంపెనీ ఇదే. ఈ కంపెనీ ప్రమోటర్ రాధాకృష్ణ దమానీ 9వ అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా అవతరించారు. రూ.299 ఇష్యూ ధరతో గత ఏడాది మార్చిలో ఐపీఓకు వచ్చిన ఈ షేర్ అదే నెల 21న రూ.699 వద్ద లిస్టయి భారీ లాభాలను అందించింది. ఇదే జోరు ఆ తర్వాత కూడా కొనసాగించింది.
మూడు నెలల గరిష్టానికి ఎస్బీఐ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ.40,000 కోట్ల మేర ఒత్తిడి రుణాలను రికవరీ చేయగలదన్న మీడియా వార్తల కారణంగా ఎస్బీఐ షేర్ 3 శాతం లాభంతో మూడు నెలల గరిష్ట స్థాయి, రూ.283కి చేరింది. గత మూడు రోజుల్లో ఈ షేర్ 5 శాతం లాభపడింది. ట్రంప్–కిమ్ చర్చలు సానుకూలంగా ఉండటంతో మార్కెట్ పెరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
విదేశీ స్టాక్ ఎక్సే ్చంజ్ల్లో నేరుగా లిస్టింగ్పై అధ్యయనానికి కమిటీ
మన దేశ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్సే ్చంజ్ల్లో నేరుగా లిస్ట్ కావడం, విదేశీ కంపెనీలు మన స్టాక్ ఎక్సే ్చంజ్ల్లో నేరుగా లిస్టింగ్కు అనుమతించే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. దీనిపై అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తగ్గిన ప్రమోటర్ల తాకట్టు వాటాల విలువ
ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తాకట్టు పెట్టిన వాటాల విలువ మే నెలలో 13 శాతం తగ్గి రూ.2,25,170 కోట్లకు పరిమితైమంది. ఏప్రిల్ నెల చివరికి ప్రమోటర్లు తనఖా పెట్టిన వాటాల విలువ రూ.2.58 లక్షల కోట్లు. కంపెనీ అవసరాలు లేదంటే వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం ప్రమోటర్లు తమ షేర్లను తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది.