కొనుగోళ్లు తగ్గినా.. రికార్డుల మోతనే!
ముంబై : జీవిత కాల గరిష్ట మార్కులతో దంచికొట్టిన స్టాక్ మార్కెట్లు, చివరికీ రికార్డు స్థాయిల్లోనే ముగిశాయి. అయితే చివరి గంటల్లో మాత్రం తమ లాభాలను స్టాక్ మార్కెట్లు కొంత మేర పోగొట్టుకున్నాయి. ప్రారంభంలోనే తొలిసారి 11,400 మార్కును చేధించిన నిఫ్టీ, ఆ మార్కును చివరి వరకు నిలుపులేకపోయింది. సెన్సెక్స్ సైతం నిఫ్టీ బాటలోనే 37,700 మార్కుకు దిగువకు పడిపోయింది. కానీ చివరికి సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంలో 37,700 కింద 37,691 వద్ద ముగియగా.. నిఫ్టీ 26 పాయింట్ల లాభంలో 11,387 వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట మార్కులుగా సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించి 37,805కు చేరగా.. నిఫ్టీ 11,427ను అధిగమించింది.
మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు మందగించడంతో చివరికి ఓ మోస్తరు లాభాలతో ముగిశాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. అన్ని రంగాల సూచీల్లో బ్యాంక్లు ఎక్కువగా లాభపడ్డాయి. బ్యాంక్ల తర్వాత ఆటో, ఎనర్జీ, మెటల్స్ మెరిశాయి. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఐటీ 1-0.3 శాతం మధ్య నీరసించాయి. యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా లాభాల పంట పండించగా.. టాటా మోటార్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి.
మరిన్ని వార్తలు