బుల్ రంకెలు : రికార్డులు సృష్టించిన మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలు వేస్తూనే ఉంది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త రికార్డులతో ఎంట్రీ ఇచ్చిన స్టాక్ మార్కెట్లు, చివరికి కూడా రికార్డు స్థాయిల్లోనే ముగిశాయి. పీఎస్యూ బ్యాంక్లు, ఎనర్జీ స్టాక్ల మద్దతుతో మార్కెట్లు దుమ్ము రేపాయి. మిడ్క్యాప్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్ షేర్లలో కాస్త అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుని మధ్యలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు, చివరికి మాత్రం రికార్డు స్థాయిల్లోకే ఎగిశాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంలో తొలిసారి 37,494 మార్కు వద్ద ముగిసింది.
ప్రారంభంలోనే మొట్టమొదటిసారి 11,300 మార్కును దాటిన నిఫ్టీ సైతం, చివరికీ కూడా అదే స్థాయిలో ముగించి రికార్డు సృష్టించింది. 41 పాయింట్ల లాభంలో 11,319.5 వద్ద క్లోజైంది. పీఎస్యూ బ్యాంక్లు బిగ్ గెయిన్గా నిలిచాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు అద్భుతంగా ఉండటంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్టెల్ 5 శాతం వరకు ర్యాలీ జరిపాయి. వీటితో పాటు టీసీఎస్, హెచ్యూఎల్, మారుతీ సుజుకీలు కూడా టాప్ గెయినర్లుగా లాభాల పంట పండించాయి.