11,700 పాయింట్లపైకి నిఫ్టీ
జోష్నిచ్చిన అమెరికా–మెక్సికో ఒప్పందం
రెండో రోజూ కొనసాగిన రికార్డ్లు
ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లు
203 పాయింట్లు పెరిగి 38,897కు సెన్సెక్స్
47 పాయింట్ల లాభంతో 11,739కు నిఫ్టీ
అమెరికా–మెక్సికోల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా మంగళవారం లాభపడింది. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీల రికార్డ్ లాభాలు కొనసాగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ మళ్లీ కొత్త రికార్డ్లను సృష్టించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, మారుతీ షేర్ల జోరుతో ఎన్ఎస్ఈ నిఫ్టీ తొలిసారిగా 11,700 పాయింట్లపైకి ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ 203 పాయింట్ల లాభంతో 38,897 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,739 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, ఇంధన, వాహన, రంగ షేర్లు లాభపడ్డాయి.
నిఫ్టీ ఫిఫ్టీలోకి జేఎస్డబ్ల్యూ స్టీల్: కాగా నిఫ్టీ 50 నుంచి ఫార్మా షేర్ లుపిన్ను తొలగిస్తున్నారు. దీని స్థానంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ను చేరుస్తున్నారు. వచ్చే నెల 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీ నుంచి పీఎన్బీ, కమిన్స్ ఇండియా, ఇమామి, జేఎస్డబ్ల్యూ స్టీల్, పీఎఫ్సీ, ఆర్ఈసీలను తొలగిస్తున్నారు. వీటి స్థానంలో బంధన్ బ్యాంక్, బయోకాన్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, లుపిన్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీలను చేరుస్తున్నారు.