మార్కెట్లు పతనం : రూపాయి క్రాష్
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లకు అమ్మకాల సెగ తగిలింది. లాభాలతో ప్రారంభమైన నేటి దేశీయ స్టాక్ సూచీలు, రోజంతా తీవ్ర ఒత్తిడిలో కొనసాగాయి. ఇక చివరి గంట ట్రేడింగ్లో మరింత కుదేలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ సైతం 11,600 మార్కు కిందకి పడిపోయింది. ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టంలో 38,313 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంలో 11,582 వద్ద క్లోజయ్యాయి. అటు రూపాయి విలువ కూడా క్రాష్ అయింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ కూడా ఆల్-టైమ్ కనిష్ట స్థాయిల్లో 71.06 వద్ద నమోదైంది.
నేటి ట్రేడింగ్లో ఎక్కువగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ నష్టపోయింది. ఎఫ్ఎంసీజీతో పాటు బ్యాంక్లు, ఆటో స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్క్యాప్స్లో కూడా ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. విప్రో, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్లుగా నిలువగా... హెచ్యూఎల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ ఎక్కువగా నష్టపోయి టాప్ లూజర్లుగా నిలిచాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ 2 శాతం, హెచ్యూఎల 4.6 శాతం, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ 2 శాతం నుంచి 2 శాతం నష్టాలు పాలయ్యాయి. అయితే ఐటీ దిగ్గజ విప్రో లిమిటెడ్ షేర్లు మాత్రం 2013 జూలై నుంచి నేడే అత్యధిక ఇంట్రాడే గెయిన్ను నమోదుచేశాయి. విప్రో షేర్లు 8 శాతం మేర లాభపడ్డాయి. అమెరికాకు చెందిన అలైట్ సొల్యూషన్స్ ఎల్ఎల్సీ రూ.10,500 కోట్లకు పైగా కాంట్రాక్ట్ను గెలవడంతో విప్రో ఈ మేర లాభపడింది.
మరిన్ని వార్తలు