చివర్లో కొనుగోళ్లు..
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
ప్రభావం చూపని ఫెడ్ పెంపు..
194 పాయింట్ల లాభంతో 33,247కు సెన్సెక్స్
59 పాయింట్లు పెరిగి 10,252కు నిఫ్టీ
రోజంతా లాభనష్టాల మధ్య కదలాడిన గురువారం నాటి ట్రేడింగ్లో... చివరి గంటలో జరిగిన కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ లాభపడింది. దీంతో గత రెండు రోజుల నష్టాలకు బ్రేక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో 33,247 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 10,252 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో బాగా కొనుగోళ్లు జరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనున్నట్లు గురువారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే మార్కెట్ చివరి గంటలో లాభపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
434 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్..
గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 403 పాయింట్లు నష్టపోయింది. ఇక గురువారం ఒక దశలో 268 పాయింట్లు లాభపడగా, మరో దశలో 166 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద సెన్సెక్స్ 434 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 10,142–10,276 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది.
పెరిగిన టోకు ద్రవ్యోల్బణం..
భారత ఆర్థిక వృద్ధి రానున్న రెండు క్వార్టర్లలో మెరుగుపడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ తాజా నివేదిక వెల్లడించడం సానుకూల ప్రభావం చూపించింది. భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి అధ్వాన పరిస్థితులు దాదాపు ముగిసేనట్లేనని ఈ సంస్థ పేర్కొంది. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం 3.93 శాతానికి పెరగడంతో ఇన్వెస్టర్లలో అప్రమత్తత నెలకొన్నది. మరోవైపు అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఈ పెంపు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, డాలర్తో రూపాయి మారకం బలపడడం స్టాక్ మార్కెట్కు జోష్నిచ్చింది. నేటి(శుక్రవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభం కావడం,గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానుండటంతో మార్కెట్లో అనిశ్చితి ఏర్పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారం (ఈ నెల 18న) వస్తాయి.
మరిన్ని వార్తలు