దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం దూసుకుపోతున్నాయి. ట్రేడింగ్ మొదట్లోనే లాభాల సెంచరీ సాధించిన సెన్సెక్స్ 32వేల మైలురాయిని అధిగమించేసింది. ప్రస్తుతం148 పాయింట్ల లాభంలో 32,073 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 42.70 పాయింట్లు లాభపడి 10,050 మార్కు పైన 10,059 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు 3-4.5 శాతం ర్యాలీ కొనసాగిస్తున్నాయి.
కేకేఆర్ నిర్వహించే ఫండ్ టవర్ బిజినెస్లను కొనుగోలు చేస్తుందనే వార్తలతో ఈ కంపెనీలు లాభపడుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్లతో పాటు గెయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, వేదంత, అరబిందో ఫార్మా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ టాప్ గెయినర్లుగా ఉండగా.. యస్బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకులు ఒత్తిడిలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 0.6 శాతం పైకి జంప్ చేసింది. అమెరికా నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు నేడు లాభాలు పండిస్తున్నాయి.