సెన్సెక్స్ రికార్డు హై, నిఫ్టీ మైనస్
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ చివరిలో ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ రికార్డు హైలోనే ముగియగా.. నిఫ్టీ మైనస్లలో నెగిటివ్గా క్లోజైంది. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంలో 36,858 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంలో 11132 వద్ద స్థిరపడ్డాయి. గత రెండు రోజుల నుంచి ఆల్-టైమ్ గరిష్టాలలో రంకెలు కొడుతున్న మార్కెట్లు, నేడు చివరిలో మాత్రం ఆ సరికొత్త గరిష్టాలకు చేరుకోలేకపోయాయి. మధ్యలో సెన్సెక్స్ సరికొత్త గరిష్టానికి చేరుకున్నప్పటికీ, ఆ స్థాయి నుంచి సెన్సెక్స్ తన లాభాలను కోల్పోవాల్సి వచ్చింది. చివరి గంటలో మిడ్క్యాప్స్, మెటల్స్, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఆటో, ఐటీలలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను బాగా దెబ్బకొట్టింది. మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా నెగిటివ్ ధోరణిలో ఫ్లాట్గా ముగిసింది.
కాగ, నేడు మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 36,947కు చేరి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ సైతం 11,157ను తాకింది. ఆ లాభాలను అలానే కొనసాగించుకుంటూ వచ్చింది. కానీ చివరిలో మాత్రం అమ్మకాల తాకిడి తట్టుకోలేక కిందకి పడిపోయింది. ఎఫ్అండ్వో ముగింపు కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఊగిసలాటకు లోనైనట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాలు 1.4-0.5 శాతం మధ్య క్షీణించగా.. పీఎస్యూ బ్యాంక్స్ 1.4 శాతం, మెటల్ 0.9 శాతం చొప్పున ఎగిశాయి. ఐబీ హౌసింగ్ 4 శాతం జంప్చేయగా, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, యూపీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, వేదాంతా 2-1 శాతం మధ్య పెరిగాయి. అయితే ఎన్టీపీసీ 4 శాతం పతనంకాగా, లుపిన్, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్, యాక్సిస్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్పీసీఎల్, ఐషర్, పవర్గ్రిడ్ 3-1.5 శాతం మధ్య నీరసించాయి.
మరిన్ని వార్తలు