అమ్మకాల ఒత్తిడి : పతనమైన మార్కెట్లు
ముంబై : ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అటూఇటుగా ఊగిసలాటలో ఉన్న దేశీ స్టాక్ మార్కెట్లు చివరిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఒక్కసారిగా మార్కెట్లు పతనమయ్యాయి. మిడ్ సెషన్ నుంచి ఊపందుకున్న అమ్మకాల కారణంగా సెన్సెక్స్ 218 పాయింట్ల మేర క్షీణించి, 36,324 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు కోల్పోయి 10,937 వద్ద క్లోజైంది. దీంతో తన కీలకమైన మార్కు 11,000 మైలురాయి దిగువన వచ్చి చేరింది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. ఐటీ మాత్రమే 0.6 శాతం లాభంతో ఎదురు నిలిచింది.
ఫార్మా, మెటల్, రియల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ 4.2-2.5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టెక్ మహింద్రాలు టాప్ గెయినర్లుగా నిలువగా.. టాటా స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ ఎక్కువగా 9.4 శాతం మేర కుప్పకూలింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా 8 పైసలు క్షీణించి, 68.61గా నమోదైంది.