బ్యాంకుల సపోర్టు : స్వల్ప నష్టాలతో సరి
ముంబై : తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు, చివరి గంట ట్రేడింగ్లో కాస్త కోలుకున్నాయి. బ్యాంకుల సపోర్టుతో స్వల్ప నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల నష్టంలో, 33,835 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంలో 10,410 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండడం, యూఎస్లో ట్రేడ్ వార్, టారిఫ్ వార్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ను తొలగించడం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో నేటి ట్రేడింగ్లో దేశీయ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అనంతరం అంతకంతకూ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
ఈ ప్రభావంతో మిడ్ సెషన్ సమయానికి సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టాల్లోకి జారింది. మరోసారి భారీ నష్టాలు తప్పవనే అంచనాలు వస్తుండగా.. ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో, చివరి గంటలో మార్కెట్లు కోలుకున్నాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, టెక్ మహింద్రా, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ 3 శాతం వరకు లాభపడగా.. టాటా స్టీల్, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్పీసీఎల్లు 3 శాతం మేర కిందకి పడిపోయాయి.