సూచీలకు బ్యాంక్ షేర్ల బలం
బ్యాంక్లకు భారీ నిధుల వార్తలతో లాభాల్లో మార్కెట్
100 పాయింట్ల లాభంతో 32,607కు సెన్సెక్స్
23 పాయింట్ల లాభంతో 10,208కు నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల్లోనే ముగిసింది. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు, బ్యాంక్లకు భారీ స్థాయిలో నిధులు అందనున్నాయన్న వార్తల కారణంగా మంగళవారం స్టాక్ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 10,200 పాయింట్లపైన, సెన్సెక్స్ 32,600 పాయింట్ల ఎగువున ముగిశాయి.
రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, స్టాక్ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 32,607 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,208 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, లోహ, రియల్టీ స్టాక్స్ లాభపడ్డాయి.
బలపడుతున్న సెంటిమెంట్....
ఇప్పటివరకూ వెలువడిన కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతుండటంతో సెంటిమెంట్ బలపడుతోందని నిపుణులంటున్నారు.
రూ.6 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ క్యాప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం ఇంట్రాడేలో రూ.6 లక్షల కోట్లను దాటింది. ఒక భారత కంపెనీ ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.947.70ను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,00135 కోట్లుగా ఉంది. చివరకు ఈ షేర్ 0.5 శాతం నష్టంతో రూ.948 వద్ద ముగిసింది.
ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,91,618 కోట్లుగా నమోదైంది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా, రూ.4,94,001 కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.4,81,954 కోట్లు, ఐటీసీ (రూ.3,25,425 కోట్లు), హిందుస్తాన్ యూనిలివర్ (రూ.2,75,159 కోట్లు) ఉన్నాయి.
మరిన్ని వార్తలు