ఐపీఓలతో రుణ వృద్ధి
మార్కెట్ జోరు కొనసాగినన్నాళ్లూ ఇష్యూలు
ఈ ఏడాది సమీకరించింది రూ.49,175 కోట్లు
ఎస్బీఐ తాజా నివేదిక వెల్లడి
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) జోరుతో రుణ వృద్ధి మెరుగుపడుతోందని ఎస్బీఐ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు, రుణ వృద్ధికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఈ ఏడాది అధికంగా ఐపీఓల ద్వారా నిధల సమీకరణ జరిగిందని, ఇది రుణవృద్ధి పెరగడానికి తోడ్పడిందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యాంశాలివీ...
♦ మార్కెట్ జోరు కొనసాగినంత కాలం ఐపీఓల జోరు కూడా కొనసాగుతుంది.
♦ ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల షేర్ల జోరును బట్టి, భవిష్యత్తు ఐపీఓ మార్కెట్ అధారపడి ఉంటుంది.
♦ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.49,175 కోట్లు సమీకరించాయి. ఇది 2012–2016 మధ్య కాలంలో వచ్చిన ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు కంటే ఎక్కువ.
♦ 2014–15 ఆర్థిక సంవత్సరం వరకూ ఐపీఓ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది.
♦ 2015–16లో 70 కంపెనీలు, గత ఆర్థిక సంవత్సరంలో 106 కంపెనీలు కొత్తగా స్టాక్ మార్కెట్లో లిస్ట్కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకూ మొత్తం 112 కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి.
♦ ఈ ఆర్థిక సంవత్సరంలో బీమా రంగం నుంచి నాలుగు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.31,320 కోట్లు సమీకరించాయి.
♦ రంగాల వారీగా చూస్తే, ఆయా సంవత్సరాల్లో ఐపీఓలు వచ్చిన రంగాల్లో రుణ వృద్ధి మెరుగుపడింది. ఉదాహరణకు 2009–10, 2010–11 మధ్య విద్యుత్తు రంగానికి సంబంధించిన ఐపీఓలు అధికంగా వచ్చాయి. ఆయా సంవత్సరాల్లో విద్యుత్తు రంగంలో చెప్పుకోదగిన స్థాయిలో రుణ వృద్ధి పెరిగింది.
♦ 2009–10, 2010–11 ఆర్థిక సంవత్సరాల్లో మైనింగ్, క్వారీయింగ్, లోహ రంగాల కంపెనీలు ఐపీఓలు వచ్చాయి. ఆ యా సంవత్సరాల్లో ఈ రంగాల్లోను రుణ వృద్ధి బాగుంది.
♦ అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది ఐటీ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.2,103 కోట్లు సమీకరించినప్పటికీ, ఐటీ రంగంలో రుణ వృద్ధి కుంటుపడింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కూడా ఇదే దారి. ఈ రంగాలపై దేశీయ అంశాల కన్నా అంతర్జాతీయ అంశాలే అధికంగా ప్రభావం చూపించడం దీనిక కారణం కావచ్చు.