ఎస్బీఐ డిపాజిట్ రేట్లు కట్..
పావు శాతం తగ్గింపు...
ఏడాది కాల వ్యవధి డిపాజిట్లపై ఇకపై 6.50 శాతమే
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తాజాగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాది కాలవ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ 6.50 శాతానికి కుదించింది. రూ. 1 కోటి దాకా డిపాజిట్లపై ఈ రేటు వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్స్కి సైతం వడ్డీ రేటును పావు శాతం తగ్గించిన ఎస్బీఐ..7 శాతం చెల్లించనుంది. అక్టోబర్ 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి తెచ్చినట్లు బ్యాంకు తెలిపింది. అలాగే, బేస్ రేటును 9 శాతం నుంచి 8.95 శాతానికి తగ్గించినట్లు, మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) మాత్రం యథాత«థంగా 8 శాతం స్థాయిలో కొనసాగిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. జూలైలోనే వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఎస్బీఐ మూణ్నెల్లు తిరగకుండానే మళ్లీ తగ్గించడం గమనార్హం.
రిజర్వ్ బ్యాంకు బుధవారం కీలక పాలసీ రేట్ల మార్పులపై నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్బీఐ రెపో రేటును 6%గా యథాతధంగా కొనసాగించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎస్బీఐతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైనవి మహిళలకు 8.35 శాతం, ఇతరులకు 8.40 శాతం వడ్డీ రేటుపై గృహ రుణాలు అందిస్తున్నాయి.