బయటపడ్డ SBI భారీ మోసం
హిడెన్ ఛార్జీల పేరిట నిర్వాకం
కోర్టుకు వెళ్లిన వినియోగదారుడు
కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ తన వినియోగదారులను భారీగా మోసం చేస్తోంది. అసలు ఎందుకు కట్ చేస్తున్నారో కూడా తెలియకుండా వినియోగదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ చేస్తూ.. అడిగిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారో బ్యాంకు అధికారులకే తెలియవు.
ఇటీవల కృష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే అనుమానం వచ్చిన కృష్ణ మోహన్ శర్మ, తన ఖాతా ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఏ.ఎస్.రావు నగర్ బ్రాంచ్కి వెళ్లి వివరణ కోరాడు. కానీ బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే కృష్ణ మోహన్ శర్మ “బ్యాంకింగ్ అంబుడ్స్మెన్”కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్మెంట్ కోసం 150 రూపాయలు కట్ చేసినట్లు తెలిపారు. అసలు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకోలేదని.. ఆ సమయంలో బ్యాంకులోనే లేనని.. అయినా అధికారులు డబ్బులు కట్ చేశారని ఆయన వాపోయాడు.
బ్యాంకు అధికారుల తీరును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లిన్నా అతడికి న్యాయం మాత్రం జరుగలేదు. అయితే పట్టువదలని కృష్ణ మోహన్ కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ చార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదనను వెల్లబుచ్చాడు. కోర్టు వెంటనే ఎస్బీఐ బ్యాంక్ ఏ.ఎస్.రావు నగర్ బ్రాంచ్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది.