పన్నులు తగ్గించండి.. ప్రోత్సాహకాలివ్వండి
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కార్పొరేట్ల వినతి
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గించాలని, పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని దేశీ కార్పొరేట్ వర్గాలు కేంద్రాన్ని కోరాయి. ప్రస్తుతం 30 శాతం దాకా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ను 18–25 శాతానికి తగ్గించాలని పేర్కొన్నాయి. బడ్జెట్ ముందస్తు సమాలోచనల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో బుధవారం భేటీ అయిన సందర్భంగా కార్పొరేట్లు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే జీఎస్టీ రీఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎగుమతి సంస్థల ప్రతినిధులు కోరారు.
ఎగుమతి ఆదాయాలపై పన్ను మినహాయింపులు లేదా తక్కువ లెవీ విధింపు అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతానికి తగ్గిస్తామంటూ జైట్లీ గతంలోనే హామీ ఇచ్చారని, ఈ బడ్జెట్లో దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నామని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని, ఈ నేపథ్యంలో దీన్ని తగ్గించాలని కోరినట్లు సీఐఐ ప్రెసిడెంట్ శోభన కామినేని చెప్పారు.