ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె సైరన్
సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మూకుమ్మడి సెలవులు
పెన్షన్ సంబంధిత సమస్యలే కారణం
హైదరాబాద్: సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న పెన్షన్ సంబంధిత సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్బీఐ ఉద్యోగులు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మూకుమ్మడిగా సాధారణ సెలవులు పెడుతున్నట్లు వెల్లడించింది. సోమవారం ఆర్బీఐ కార్యాలయం వద్ద నిశ్శబ్ద ప్రదర్శన చేపట్టిన అధికారులు.. ఆగస్టు 27న నిరసనకు సంబంధించిన మెమొరాండంను రీజినల్ డైరెక్టర్కు సమర్పించనున్నట్లు తెలిపారు.
ఆర్బీఐ ఉద్యోగులు ఇప్పటికే చాలా కాలం నుంచి ఓపికతో ఉన్నారని, ప్రభుత్వ ఉన్నత అధికారుల వైఖరి చూసి ఇప్పుడు సమ్మె నిర్ణయం తీసుకోక తప్పడంలేదని పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 2012 తరువాత విధులు చేపట్టిన వారికి సీపీఎఫ్/అదనపు పీఎఫ్ వర్తింపు, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ రిటైనర్లకు సంబంధించిన పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం పేర్కొంది.