ప్రి–ఐపీఓ ప్లేస్మెంట్ రద్దు చేయాలి
హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీకి సెబీ ఆదేశం
11 నుంచి ఐపీవో ప్రారంభం!
ముంబై: ముందస్తు ఐపీఓలో భాగంగా డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లకు కేటాయించిన షేర్లను రద్దు చేయాల్సిందిగా హెచ్డీఎమ్సీ ఏఎమ్సీని సెబీ ఆదేశించింది. వీరి నుంచి సమీకరించిన మొత్తాలను 12% వడ్డీతో తిరిగి చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన 140 మంది డిస్ట్రిబ్యూటర్లకు షేర్లను కేటాయించింది.
ఒక్కో షేర్ను రూ.1,050 ధర చొప్పున కేటాయించి మొత్తం రూ.150 కోట్లు సమీకరించింది. హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ షేర్లు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు పక్షపాతంతో కూడిన సూచనలు ఇస్తారన్న విమర్శలు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. దీంతో ముందస్తు–ఐపీఓ ప్లేస్మెంట్ను రద్దు చేయాలని సెబీ ఆదేశించింది.
కాగా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ ఐపీఓ ఈ నెల 11న మొదలై 13న ముగుస్తుందని సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,462 కోట్లు సమీకరిస్తుందని అంచనా. మార్కెట్ లాట్(కనీసం దరఖాస్తు చేయల్సిన షేర్ల సంఖ్య) 11గానూ, ప్రైస్బ్యాండ్ రూ.1,345–1,360 రేంజ్లో ఉండే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 2.54 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది.