కొనసాగుతున్న లాభాలు..
నాలుగో రోజూ పెరిగిన స్టాక్సూచీలు
118 పాయింట్ల లాభంతో 33,478కు సెన్సెక్స్
28 పాయింట్లు పెరిగి 10,327కు నిఫ్టీ
సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు ఫార్మా షేర్ల ర్యాలీతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీల లాభాలు నాలుగో రోజూ కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 33,478 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 10,327 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 265 పాయింట్లు లాభపడింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్717 పాయింట్లు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ఫార్మా షేర్లు రాణించడం కలసివచ్చింది. ఇటీవల లాభపడిన షేర్లలో అమ్మకాలు చోటు చేసుకోవడంతో లాభాలు పరిమితమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి మరో జాబితా వెల్లడి కానున్నదనే అంచనాల నేపథ్యంలో బ్యాంక్ షేర్లపై దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో మార్కెట్ జోరు కొనసాగుతోందని విశ్లేషకులంటున్నారు.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 5 శాతం అప్..
విశాఖపట్నం ప్లాంట్కు సంబంధించి అమెరికా ఎఫ్డీఏ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్(ఈఐఆర్) పొందడంతో డాక్టర్ రెడ్డీస్ షేర్ 5 శాతం లాభపడి రూ.2,391 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, సిప్లా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి.