మరో సంచలనమా? అత్యంత తక్కువకి జియో స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : రిలయన్స్ మరో సంచలనానికి తెరతీయబోతుంది. ఎల్వైఎఫ్ బ్రాండు కింద ఆల్ట్రా లో-ధరతో ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. దీనికోసం తైవనీస్ చిప్సెట్ తయారీదారి మీడియా టెక్తో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకుంది. దేశీయ టెల్కోలకు గట్టి పోటీ ఇచ్చేందుకే రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ డివైజ్తో మరింత మంది కస్టమర్లను తన సొంతం చేసుకోవాలని చూస్తోంది.
దేశీయ టెలికాం కంపెనీలు, మొబైల్ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంటూ.. 4జీ స్మార్ట్ఫోన్లను క్యాష్బ్యాక్ల ద్వారా రూ.1500 కంటే తక్కువకే ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జియో కూడా అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయాలని చూస్తోంది. జియోఫోన్కు అవలంభించిన విధానాన్నే ఈ స్మార్ట్ఫోన్కు అనుసరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు. దీంతో ఈ స్మార్ట్ఫోన్ రిలయన్స్ జియో సిమ్తో పాటు, పలు ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది. ఈ 4జీ డివైజ్ మిలియన్ యూనిట్ల ఆర్డర్లను కూడా రిలయన్స్ త్వరలోనే స్వీకరించనుందని ఓ అధికారి చెప్పారు.
ధర, వాడకం వంటి కారణాలతో 500 మిలియన్ మంది ఫీచర్ ఫోన్ యూజర్లు, స్మార్ట్ఫోన్లలోకి మారలేకపోతున్నారని, వారిని టార్గెట్ చేసుకునే రిలయన్స్ ఈ ప్లాన్స్ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఆ యూజర్లనే లక్ష్యంగా చేసుకుని జియోఫోన్ను కూడా రిలయన్స్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీకి చెందిన 4జీ టెలికాం ఆపరేటర్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చిప్సెట్ తయారీదారి మీడియాటెక్ ధృవీకరించింది. ఆండ్రాయిడ్ గో స్మార్ట్ఫోన్పై జియో బులిష్గా ఉందని, తమతో కలిసి రిలయన్స్ పనిచేస్తుందని మీడియాటెక్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ సేల్స్ కంట్రీ హెడ్ కుల్దీప్ మాలిక్ తెలిపారు. వచ్చే నెలల్లో ఈ డివైజ్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు కూడా పేర్కొన్నారు. కేవలం జియో మాత్రమే కాక, చైనీస్ హ్యాండ్షెట్ తయారీదారులు కూడా ఆండ్రాయిడ్ గో ఆధారితంగా స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
మరిన్ని వార్తలు