రికార్డులకు బ్రేక్ : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మోతకు బ్రేకిచ్చాయి. సోమవారం వరకు రికార్డుల మీద రికార్డులు సృష్టించిన మార్కెట్లు, మంగళవారం ట్రేడింగ్లో కిందకి పడిపోయాయి. సెన్సెక్స్ 37,400 మార్కు కిందకి, నిఫ్టీ 11,300 కిందకి పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా 139 పాయింట్ల నష్టంలో 37,354 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంలో 11,283 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో యాక్సిస్ బ్యాంక్, టెక్ మహింద్రా, ఓఎన్జీసీ, లుపిన్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ 0.5 శాతం నుంచి 1 శాతం మధ్యలో లాభపడగా.. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ ఎక్కువగా నష్టాలు పాలయ్యాయి.
జూన్ క్వార్టర్ ఫలితాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన అవెన్యూ సూపర్ మార్ట్స్ 3 శాతం మేర లాభపడింది. దేశీయ రూపాయి విలువ ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్పంగా పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 68.70 వద్ద ప్రారంభమైంది. సోమవారం ముగింపు నాటికి ఈ విలువ 68.67గా ఉంది. రికార్డుల స్థాయిల వద్ద మార్కెట్లు నమోదు కావడంతో, అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.