ఆర్బీఐ షాక్ : మార్కెట్లు ఢీలా
ముంబై : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజార్టీ విశ్లేషకుల అంచనాలకు షాకిస్తూ... అనూహ్యంగా వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ ఇచ్చిన ఈ షాక్కు మార్కెట్లు ఠప్పుమని పడిపోయాయి. ఇన్ని రోజులు రికార్డుల జోరు కొనసాగించిన స్టాక్ మార్కెట్లు, ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచడంతో భారీగా పడిపోతున్నాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 పాయింట్ల మేర పడిపోయింది. ప్రస్తుతం మరింత క్షీణించి 244 పాయింట్ల నష్టంలో 37,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం తన కీలకమైన మార్కు 11,300 కంటే కిందకి జారింది. 68 పాయింట్ల నష్టంలో 11,277 వద్ద కొనసాగుతోంది.
ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో, బ్యాంక్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం మేర డౌన్ అయింది. ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు నష్టాలు పాలవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐలతో పాటు హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, మారుతీ సుజుకీలు టాప్ లూజర్లుగా ఉన్నాయి. మరోవైపు ఓఎన్జీసీ, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, లుపిన్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్లు టాప్ గెయినర్లుగా లాభాలు పండించాయి.
మరిన్ని వార్తలు