10,400 పైకి నిఫ్టీ
నాలుగో రోజూ లాభాలే
తొలగిన వాణిజ్య ఉద్రిక్తతల భయాల ఎఫెక్ట్
వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. నిఫ్టీ 10,400 పాయింట్లపైకి ఎగబాకింది. బ్యాంక్, లోహ షేర్ల దన్నుతో సెన్సెక్స్ 92 పాయింట్లు పెరిగి 33,880 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,402 పాయింట్ల వద్ద ముగిశాయి.
కొన్ని నిర్దిష్టమైన వస్తువులపై దిగుమతి సుంకాల తగ్గింపు, మరిన్ని మార్కెట్లకు వాణిజ్య విస్తరణ తదితర అంశాలతో కూడిన భవిష్యత్తు ఆర్థిక ఎజెండాను చైనా వెలువరించింది. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే విశ్వాసంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపుతోంది.
సోమవారం అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లో ముగియడం, ఈ దన్నుతో మంగళవారం ఆసియా మార్కెట్లు లాభపడటం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం కలసివచ్చాయి. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో మరింతగా లాభపడింది. ఇంట్రాడేలో 161 పాయింట్ల లాభంతో 33,950 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
వాణిజ్య సుంకాల విషయమై చైనా నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ప్రపంచ మార్కెట్లు ర్యాలీ జరిపినా, మన మార్కెట్ మాత్రం పరిమిత శ్రేణిలోనే కదలాడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో లోహ, రియల్టీ షేర్లు లాభపడ్డాయని వివరించారు. మద్దతు స్థాయి నుంచి మార్కెట్ పెరుగుతోందని, క్యూ4 ఫలితాలపై ఆశావహ అంచనాలే దీనికి కారణమని వివరించారు.