కొనుగోళ్ల జోరు : మార్కెట్లకు భలే జోష్
ముంబై : చివరి గంట ట్రేడింగ్... దేశీయ స్టాక్ మార్కెట్లకు భలే జోషిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు జోరందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. మిడ్సెషన్ వరకూ కన్సాలిడేట్ అవుతూ ఉన్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో చివర్లో ఊపందుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 196 పాయింట్ల మేర జంప్ చేసి 36,520 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 71 పాయింట్లు ఎగసి 11,008 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 36,500, నిఫ్టీ 11,000 పాయింట్లకు ఎగువన ముగిశాయి.
నేటి ట్రేడింగ్లో మిడ్క్యాప్స్ మంచి లాభాలను పండించాయి. 2.5 శాతం పెరిగాయి. ఫైనాన్సియల్, పీఎస్యూ బ్యాంక్లు, ఫార్మాస్యూటికల్స్, మెటల్స్, ఎనర్జీ స్టాక్స్ లాభాల్లోకి జంప్ చేశాయి. నేటి ట్రేడింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా, హెచ్పీసీఎల్, ఐఓసీ టాప్ గెయినర్లుగా ఉండగా.. హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహింద్రా టాప్ లూజర్లుగా ఉన్నాయి. చమురు ధరలు పతనంకావడం హెచ్పీసీఎల్ 7 శాతం, ఐవోసీ 5 శాతం, బీపీసీఎల్ 3 శాతం చొప్పున పెరిగాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలపడి 68.39గా నమోదైంది.