మూడేళ్లలో లక్ష పేమెంట్స్ బ్యాంకింగ్ పాయింట్లు
‘పేటీఎమ్ కా ఏటీఎమ్’ పేరుతో ఏర్పాటు
రూ.3,000 కోట్ల పెట్టుబడులు: రేణు సత్తి
ముంబై: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ మూడేళ్లలో లక్ష బ్యాంకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ‘పేటీఎమ్ కా ఏటీఎమ్’ పేరుతో లక్ష బ్యాంకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి మూడేళ్లలో రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ రేణు సత్తి చెప్పారు. ఈ బ్యాంకింగ్ అవుట్లెట్లలో ఖాతాదారులు తమ ఖాతాలను ప్రారంభించవచ్చని, డబ్బులు డిపాజిట్– విత్డ్రా చేసుకోవచ్చని, ఆధార్ కార్డ్ను అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలు అందని, పొందలేని కోట్లాదిమందికి ఈ విధానంలో బ్యాంకింగ్ సేవలు అందుతాయని వివరించారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్, లక్నో, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, అలీఘర్ నగరాల్లో మూడు వేలకు పైగా పేటీఎమ్ కా ఏటీఎమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆర్బీఐ రూపొందించిన కొత్త బ్యాంకింగ్ విధానమే పేమెంట్స్ బ్యాంక్. ఇప్పటికే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ గత వారమే కార్యకలాపాలు ప్రారంభించింది. త్వరలో జియో పేమెంట్స్ బ్యాంక్ కూడా రానుంది. పోటీని తట్టుకునేందుకు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారులకు ఉచిత డిజిటల్ డెబిట్కార్డ్ను, రూ.2 లక్షల వరకూ యాక్సిడెంటల్ బీమాను, ఉచితంగా నిధుల బదిలీ వంటి ఆఫర్లను అందిస్తోంది.