13వేల మంది రైల్వే ఉద్యోగులపై వేటు?
న్యూఢిల్లీ : ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఎక్కువ కాలం పాటు సెలవులు పెట్టిన ఉద్యోగులపై దేశీయ రైల్వే చర్యలు తీసుకోబోతుంది. వారిని సర్వీసు నుంచి తొలగించేందుకు సిద్ధమవుతోంది. అనధికారికంగా సెలవులు పెట్టిన వారు 13వేల మందికి పైగా ఉన్నారని ఇటీవల రైల్వే గుర్తించింది. ఆర్గనైజేషన్ పనితీరును మెరుగుపరచడానికి రైల్వే ఓ డ్రైవ్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ ద్వారా ఉద్యోగుల్లో నిజాయితీని, శ్రద్ధను పెంచడం వంటివి చేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులపై తీసుకోబోయే ఈ చర్యలు కూడా ఈ క్యాంపెయిన్ కిందవేనని రైల్వే పేర్కొంది.
''వివిధ రైల్వే స్టేషన్లలో దీర్ఘకాలికంగా సెలవులు పెడుతున్న వారిని ఈ డ్రైవ్ ద్వారా గుర్తించాం. మొత్తం 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మందికి పైగా ఉద్యోగులు అనధికారికంగా ఎక్కువ కాలం పాటు సెలవులు తీసుకుంటున్నారని తేలింది'' అని రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. నియమ నిబంధన కింద వీరిని సర్వీసు నుంచి తొలగించాలని చూస్తున్నాం అని పేర్కొంది. ఈ ఉద్యోగులను సాధారణ ఉద్యోగుల నుంచి విడదీయాలని అధికారులు, సూపర్ వైజర్లందరికీ రైల్వే ఆదేశాలు జారీచేసింది.
మరిన్ని వార్తలు