దీర్ఘకాల ‘ఎలక్ట్రిక్‌’ విధానం కావాలి!

India Proposes a Goal of 15% Electric Vehicles in Five Years - Sakshi

పన్నులు కూడా తక్కువ ఉండాలి

తయారీదారులు, కస్టమర్ల అవసరాలను గుర్తించాలి

అప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి పెట్టుబడులు వస్తాయి

కేంద్ర ప్రభుత్వానికి   సియామ్‌ సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచాలంటే అందుకు దీర్ఘకాలిక విధానంతోపాటు, పన్నులు తక్కువగా ఉండాలని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది. దీర్ఘకాలిక విధానాలు లేకపోతే... భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళికలకు ఈ రంగం మేలు చేయదని సియామ్‌ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన సియామ్‌ వార్షిక సదస్సులో సంఘం ప్రెసిడెంట్‌ అభయ్‌ ఫిరోదియా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో పెద్ద ఎత్తున వాహనాల విద్యుదీకరణకు అనుకూలంగా కేంద్రం గతంలో ప్రకటన చేసింది. కానీ ఊహించని రీతిలో, ఈవీల ప్రోత్సాహానికి ప్రత్యేకంగా విధానమేదీ విడుదల చేయబోమని కూడా చెప్పింది. బదులుగా ప్రత్యేక చర్యల ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచుతామని చెబుతోంది’’ అని ఫిరోదియా పేర్కొన్నారు. దేశం లో 2030 నాటికి 40%, 2047 నాటికి 100 శాతం వాహనాల విద్యుదీకరణకు కావలసిన విధానపరమైన చర్యలను సియామ్‌ సూచించినట్టు చెప్పారాయన. 2011లోనూ పరిశ్రమ ఇందుకు సంబంధించి ప్రతిపాదన సమర్పించినట్టు తెలిపారు. ‘‘అయినా ప్రభుత్వం దీర్ఘకాలిక విధానం ప్రకటించకుండా వెనక్కు తగ్గింది. ఇది పరిశ్రమకు మేలు చేసేది కాదు. స్పష్టమైన లక్ష్యాలను ప్రకటిస్తే పరిశ్రమ భవిష్యత్తు పెట్టుబడులకు సిద్ధమయ్యేందుకు వీలవుతుంది’’ అని ఫిరోదియా వివరించారు. ఈవీలకు మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ అవసరమన్నారు. 

జీఎస్టీ భారం....
‘‘జీఎస్టీ 28 శాతం, సెస్సు 15 శాతం పరిశ్రమ అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీన్ని పరిశ్రమ స్వాగతించింది. కానీ, ఆ తర్వాత ప్యాసింజర్‌ వాహనాలపై జీఎస్టీని గతేడాది సెప్టెంబర్‌లో పెంచారు. జీఎస్టీకి ముందున్న మాదిరే పన్ను రేటును తీసుకొచ్చారు. ఇది ఆటో పరిశ్రమ నమ్మకాన్ని దెబ్బతీసింది’’ అని అభయ్‌ ఫిరోదియా చెప్పారు. స్థిరమైన విధానాలతో కూడిన వాతావరణాన్ని పరిశ్రమ కోరుకుంటున్నట్టు చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి వాహనాలు కూడా ముఖ్యమేనన్న ఆయన, పన్నులను హేతుబద్ధీకరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పరిశ్రమ ఎబిట్డా 10 శాతంగా ఉంటే, ప్యాసింజర్‌ వాహనాలపై మొత్తం జీఎస్టీ 28–50 శాతం మధ్య ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాల పన్నులు కూడా కలుపుకుంటే మొత్తం మీద పన్ను కొన్ని రాష్ట్రాల్లో 70 శాతం వరకూ ఉంటుందన్నారు. ఇది సమంజసమైన పన్ను కాదంటూ, యూరోప్, జపాన్‌ తదితర దేశాల్లో 17–20% మధ్యే ఉన్నట్టు చెప్పారు. అధిక పన్నుల కారణంగా పరిశ్రమ పూర్తి సామర్థ్యం మేరకు రాణించలేదని అభిప్రాయపడ్డారు.  

ధరలు దిగొస్తాయి: పవన్‌ గోయంకా 
దేశంలో ఈవీ విభాగం వచ్చే ఐదేళ్ల కాలంలో స్థిరపడుతుందన్న అభిప్రాయాన్ని ఎం అండ్‌ ఎం ఎండీ పవన్‌ గోయంకా వ్యక్తం చేశారు. ఈ కాలంలో బ్యాటరీ ధరలు తగ్గడం వల్ల వాహనల ధరలు దిగొస్తాయని, అదే సమయంలో వినియోగం పెరగడం కూడా దోహదపడుతుందని సియామ్‌ సదస్సులో చెప్పారు. కొంత కాలానికి సబ్సిడీల అవసరం కూడా తగ్గిపోతుందన్నారు. ఈవీలను వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యత కోసం ఫేమ్‌ పథకం అవసరం మరో 3–4 ఏళ్లు ఉంటుందన్నారు. బ్యాటరీల ధరలు గత రెండేళ్లలో 20–25 శాతం మేర తగ్గాయని, వచ్చే రెండేళ్లలో మరో 20–25 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు గోయంకా చెప్పారు. 2030కి దేశీ మార్కెట్లో ఈవీలు 30% ఉంటాయని అంచనా వేశారు. రెండో దశ ఫేమ్‌ పథకం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, విక్రయాల ప్రోత్సాహం కోసం ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. రెండో దశ ఫేమ్‌ పథకం మరో ఐదేళ్ల కాలం కోసం కేంద్రం రూ.5,500 కోట్లను కేటాయించింది.  

ప్రపంచ మొబిలిటీ సదస్సు నేడే  ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రపంచ తొలి మొబిలిటీ సదస్సు ‘మూవ్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోత్సాహకాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించనున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ రెండు రోజుల సదస్సును నీతి ఆయోగ్‌ నిర్వహిస్తుండగా, కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్, రవిశంకర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొంటారు. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా పాలుపంచుకోనున్నాయి. ప్రపంచ దేశాల నుంచి ప్రభుత్వ నేతలు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు 2,200 మందికి పైగా హాజరుకానున్నారు. రెండో దశ ఫేమ్‌ పథకం శుక్రవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీన్ని ఖరారు చేసేందుకు గాను 30కు పైగా ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాభ్‌ కాంత్‌ తెలిపారు. ఫేమ్‌ తొలిదశ రెండేళ్ల అమలు కాలం 2017 మార్చితో ముగిసింది. అయితే, ప్రభుత్వం ఆ తర్వాత గడువును పెంచుతూ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా రెండో దశ ఆమోదం పొందే వరకు అమల్లో ఉంటుందని కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది.   

పర్మిట్లు అవసరం లేదు: గడ్కరీ 
ఎలక్ట్రిక్‌ వాహనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించే వాహనాలకు పర్మిట్ల నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. సియామ్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఈ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే ఈ చర్య అన్నారు. ‘‘ఈవీలు, ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్, బయోడీజిల్, సీఎన్‌జీ, మెథనాల్, బయో ఫ్యూయల్‌ను వాడే ఆటోరిక్షాలు, బస్సులు, ట్యాక్సీలను పర్మిట్ల నుంచి మినహాయించాలని నిర్ణయించాం’’ అని గడ్కరీ చెప్పారు. వాహనాల తయారీదారులు ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, నిర్ణీత శాతం మేర ఈవీలను వినియోగించేలా క్యాబ్‌ అగ్రిగేటర్లను తప్పనిసరి చేయడం ద్వారానూ డిమాండ్‌ను సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ఈవీలపై జీఎస్టీ 12 శాతం ఉంటే, నా ఉద్దేశంలో ఇక సబ్సిడీ అవసరం అని అనుకోను. నాన్‌ ఫిస్కల్‌ ప్రోత్సాహకాల ద్వారా ఈవీల ఉత్పత్తిని వచ్చే ఐదేళ్ల కాలంలో పెంచేందుకు ఉపరితల రవాణా శాఖ పూర్తి వివరాలతో ఓ నివేదిక రూపొందించింది’’ అని తెలిపారు.  

చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు: అనంత్‌గీతే 
ఎలక్ట్రిక్‌ వాహనాలకు చక్కని చార్జింగ్‌ వసతుల అవసరం ఉందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్‌గీతే చెప్పారు. ఈవీలు కూడా సుస్థిర అభివృద్ధికి సాయపడతాయన్నారు. దేశవ్యాప్తంగా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో ఒకేసారి 18 చార్జింగ్‌ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్‌ రంగం ఆందోళనలను పరిష్కరించే విధంగా ఓ సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందని గీతే చెప్పారు. పాలసీని తీసుకురావడంతోనే సరిపోదని, దాని అమలు కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.  అధిక పన్నులు ఉన్న రంగాల్లో ఆటోమొబైల్‌ కూడా ఒకటని మంత్రి అంగీకరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top