పేటీఎం యూజర్లకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ ఆఫర్
ముంబై : దేశంలోనే అతిపెద్ద పేమెంట్స్ ప్లాట్ఫామ్ పేటీఎం, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో పేటీఎం యూజర్లకు ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీరహిత స్వల్పకాలిక డిజిటల్ రుణాలను అందిస్తోంది. గరిష్టంగా 45 రోజల వ్యవధిలో రూ.20వేల వరకు రుణం ఆఫర్ చేస్తోంది. ఒకవేళ 45 రోజులకు మించితే బ్యాంకు జరిమానా కింద రూ.50 విధిస్తోంది. అదేవిధంగా నెలకు 3 శాతం వడ్డీ వేస్తోంది. పేటీఎం, ఐసీఐసీఐ బ్యాంకు కామన్ కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లేదా ఐసీఐసీఐ బ్యాంకు వాలెట్ ప్యాకెట్ కస్టమర్లకు, ఇతర బ్యాంకుల వాలెట్ కస్టమర్లకు అందుబాటులో ఉండదు. కస్టమర్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకు ఈ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. '' ఈ కొత్త ఆఫర్ ఇన్స్టాంట్ క్రెడిట్ పొందాలనుకుంటున్న మిలియన్ల కొద్దీ పేటీఎం కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సినిమాలు, విమాన ఛార్జీల చెల్లింపుల నుంచి రోజువారీ వినియోగ వస్తువులకు చెల్లించడానికి ఈ ఇన్స్టాంట్ క్రెడిట్ లభ్యమవుతుంది'' అని ఐసీఐసీఐ బ్యాంకు, పేటీఎం ప్రకటించాయి.
పేటీఎం-ఐసీఐసీఐ బ్యాంకు పోస్టు పెయిడ్ అనే పేరుతో దీన్ని లాంచ్ చేశారు. ఇన్స్టాంట్ యాక్టివేషన్తో ఇది డిజిటల్ క్రెడిట్ అకౌంట్. దీనికోసం ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదా బ్రాంచులకు వెళ్లాల్సినవసరం లేదు. మొత్తం ఆన్లైన్ ద్వారానే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు. తమ కస్టమర్లు చెల్లింపులకు ఎంతో విశ్వసనీయతతో ఉంటారని, రోజూవారీ ఖర్చులు వెంటనే చెల్లించడానికి పేటీఎం పోస్టుపెయిడ్ ఎంతో ఉపయోగపడుతుందని పేటీఎం సీఈవో, వ్యవస్థాపకుడు శేఖర్ శర్మ చెప్పారు. రూ.3వేల నుంచి రూ.10వేల రేంజ్లో ఇస్తోంది. రీపేమెంట్ హిస్టరీ ఆధారంగా ఈ రుణాన్ని రూ.20వేల వరకు కూడా ఆఫర్ చేస్తోంది. పేటీఎం యాప్ వాడుతున్న ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలోనే పేటీఎం యాప్ వాడుతున్న నాన్-ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు ఇది అందుబాటులోకి వస్తుందని తెలిసింది.