తొలి దేశీయ మహిళా కండోమ్ 'వెల్వెట్'
న్యూఢిల్లీ: మహిళల కోసం తొలిసారిగా దేశీయంగా రూపొందించిన కండోమ్ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. తొలి స్వదేశీ పరిజ్ఞానంతో సహజ రబ్బరు పాలు- ఆధారితంగా రూపొందించిన మహిళా గర్భనిరోధక సాధనం 'వెల్వెట్' జాతీయ కుటుంబ నియంత్రణ సదస్సులో ఆయన ఆవిష్కరించారు.
హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ కంపెనీ మహిళల కోసం ప్రత్యేకంగా 'వెల్వెట్' పేరుతో దీన్ని రూపొందించిది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవాంఛిత గర్భధారణను నివారించేందుకు మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వీటిద్వారా పునరుత్పత్తికి సంబంధించిన విషయాల్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా వారికి రక్షణ అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ కండోమ్ పూర్తిగా సురక్షితమైందనీ, సురక్షిత శృంగారంపై మహిళలకు మరింత నియంత్రణ కల్పిస్తుందనీ మంత్రి నడ్డా తెలిపారు.
కేరళ తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ పరిశోధన కేంద్రంలో పూర్తి దేశీయంగా ఈ కండోమ్ను రూపొందించారు. దాతల ఆర్థిక సహకారంతో మరింతగా అభివృద్ధి పరిచే దిశగా హెచ్ఎల్ఎల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అర్హత సంపాదించింది. మహిళా కండోమ్ 'వెల్వెట్' ఇటీవల దాత నిధులతో కార్యక్రమాల కింద సంస్థాగత సేకరణకు అర్హత సాధించింది, 'వెల్వెట్' సంవత్సరానికి 25 మిలియన్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క (WHO) తోపాటు యూరోపియన్ యూనియన్ ( ఈయూ) దక్షిణ ఆఫ్రికా దేశాల అనుమతి సంపాదించింది. సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా 'వెల్వెట్' కండోమ్ తయారీ ప్ర్రకియకు 2010 లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.