ఎయిరిండియా అమ్మకం.. అటకెక్కినట్లే..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాల విక్రయ యోచనను కేంద్రం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన నిధులు కూడా ప్రభుత్వం సమకూర్చనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాను విక్రయించడానికి పెట్టిన ప్రతిపాదనకు బిడ్డర్ల నుంచి స్పందన కరువైన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎయిరిండియా రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు కావాల్సిన నిధులను కేంద్రం త్వరలోనే సమకూరుస్తుందని సదరు అధికారి చెప్పారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఆర్థిక శాఖ, పౌర విమానయాన శాఖకు చెందిన పలువులు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‘‘ఇప్పటికిప్పుడు ఎయిరిండియాలో డిజిన్వెస్ట్మెంట్ చేయాలన్న తొందరేమీ లేదు. ఎయిరిండియా.. లిస్టింగ్ ప్రమాణాలు అందుకున్నాకే ఐపీవోకి వచ్చే అవకాశాలుంటాయి’’ అని అధికార వర్గాలు వివరించాయి. ఏ కంపెనీ అయినా స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కావాలంటే గడిచిన మూడేళ్లలో లాభాలు ఆర్జించినదై ఉండాలి.
సంబంధిత వార్తలు