ఇక గూగుల్‌ రుణాలు!

Google teams with banks to launch digital lending for India - Sakshi

డిజిటల్‌ ఫైనాన్స్‌ మార్కెట్లోకి టెక్‌ దిగ్గజం

భారత్‌లో 4 బ్యాంకులతో జట్టు

తేజ్‌ యాప్‌ పేరు... ‘గూగుల్‌ పే’గా మార్పు  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు ఒక్కొక్కటిగా భారత ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా గూగుల్‌ కూడా డిజిటల్‌ ఫైనాన్స్‌ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌తో జట్టు కడుతోంది. సెకన్ల వ్యవధిలోనే తక్షణ, ప్రీ–అప్రూవ్డ్‌ రుణాలు అందించబోతోంది. ఈ క్రమంలో తమ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం ’తేజ్‌’ యాప్‌ పేరును కూడా మార్చింది. ఇకపై దీన్ని ’గూగుల్‌ పే’గా వ్యవహరించనున్నారు.

ఈ యాప్‌ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా రుణాలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. లోన్‌ మొత్తం నేరుగా యూజర్ల బ్యాంకు ఖాతాలో జమవుతుందని గూగుల్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీపావళి నాటికి పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం పరిధిని మరింతగా విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కోవకి చెందిన మరిన్ని నూతన ఆవిష్కరణలను త్వరలో ఇతర మార్కెట్లలో కూడా ప్రవేశపెట్టనున్నట్లు మంగళవారం జరిగిన గూగుల్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గూగుల్‌ నెక్ట్స్‌ బిలియన్‌ యూజర్స్‌ ప్రోగ్రాం వైస్‌ ప్రెసిడెంట్‌ సీజర్‌ సేన్‌ గుప్తా వెల్లడించారు.  

ప్రస్తుతం 200 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీ డిజిటల్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ 2023 నాటికి లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని క్రెడిట్‌ సూసీ గ్రూప్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో చాటింగ్‌ యాప్‌ వాట్సాప్, సోషల్‌ మీడియా జెయింట్‌ ఫేస్‌బుక్‌ నుంచి చైనా దిగ్గజం జాక్‌మాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ దాకా బడా సంస్థలన్నీ భారత ఆన్‌లైన్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి. క్రెడిట్‌ రేటింగ్స్‌ లాంటి బాదరబందీ లేకుండా తక్కువ పేపర్‌వర్క్‌తో స్వల్పమొత్తాల్లో రుణాలు కావాలనుకునే మొబైల్‌ యూజర్లను దక్కించుకునేందుకు అవి పోటీ పడుతున్నాయి.  

5.5 కోట్ల డౌన్‌లోడ్స్‌..
సుమారు 3 లక్షల పైచిలుకు పట్టణాలు, గ్రామాల్లోని దాదాపు 5.5 కోట్ల మంది యూజర్లు తమ పేమెంట్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు గూగుల్‌ తెలియజేసింది. బస్సు చార్జీలు మొదలుకొని ఇతరత్రా కొనుగోళ్లు, సర్వీసుల దాకా దీని ద్వారా చెల్లింపులు జరుపుతున్నారని, వార్షికంగా 30 బిలియన్‌ డాలర్ల మేర లావాదేవీలు ఉంటాయని పేర్కొంది.

ప్రతి నెలా 2.2 కోట్ల మంది యూజర్లు తేజ్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు సేన్‌గుప్తా చెప్పారు. భారీ సంఖ్యలో వ్యాపార సంస్థలకు డిజిటల్‌ పేమెంట్స్‌ విధానాన్ని చేరువ చేసే క్రమంలో పెద్ద రిటైలర్లు, పైన్‌ ల్యాబ్స్‌ వంటి పేమెంట్స్‌ టెక్నాలజీ దిగ్గజాలతో జట్టు కడుతున్నట్లు వివరించారు. ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ ప్రచురణకోసం ప్రాజెక్ట్‌ నవ్‌లేఖా, అయిదు భారతీయ భాషల్లో వెబ్‌సైట్ల ఆడియోను వినగలిగే ఫీచర్‌ను ’గూగుల్‌ గో’లో చేర్చినట్లు తెలిపారు.

స్టేషన్‌ ఇంటర్నెట్‌ సేవల విస్తరణ..
తమ స్టేషన్‌ ఇంటర్నెట్‌ సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 12,000 పైచిలుకు గ్రామాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు గూగుల్‌ వివరించింది. ‘ఇందు కోసం ఇటీవలే ఏపీఎస్‌ఎఫ్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. దీని ప్రకారం ముందుగా ఈ ఏడాది ఆఖరు నాటికి విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో సర్వీసులు ప్రారంభించనున్నాం. గ్రామ పంచాయితీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలైనవాటిని అనుసంధానం చేయనున్నాం‘ అని సీజర్‌ సేన్‌గుప్తా చెప్పారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top