మూడు వారాల కనిష్టానికి పసిడి
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధరలు దాదాపు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పది గ్రా. పసిడి ధర 31 వేల రూపాయలకు కిందికి దిగి వచ్చింది. గురువారం బులియన్ మార్కెట్లో 600 రూపాయలు క్షీణించిన పసిడి ధర రూ. 30,950గానమోదైంది. గత ఏడు సెషన్లుగా భారీగా పతనమైన స్టాక్మార్కెట్లు బడ్జెట్ తరువాత తొలిసారి గురువారం లాభాలతో ముగిసింది. అటు ఈక్వీటీ మార్కెట్లు తెప్పరిల్లాయో లేదో ఇటు పసిడి ధర ఒక్క రోజులోనే మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ఇదేబాటలో కిలో వెండి ధర కూడా రూ. 39వేల కిందికు దిగజారింది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా. పసిడి రూ.70లు తగ్గి 29,925గా ఉంది.
దేశ రాజధానిలో, 99.9శాతం స్వచ్ఛత,9 9.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ .30,950, రూ .30,800ల స్థాయికి పడిపోయాయి. జనవరి 18 న 99.9 శాతం బంగారం ధర 30,950 రూపాయలుగా ఉంది. అయితే సావరిన్ (ఎనిమిది గ్రాముల) బంగారం ధర రూ .24,800 వద్ద ఉంది. బంగారం తర్వాత మరో విలువైన లోహం వెండి కిలో 450 రూపాయలు తగ్గి రూ. 38,900 కి చేరుకుంది. దీంతో బంగారం పెట్టుబడులపై ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించాలని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్గా వడ్డీ రేటు పెంపు అంచనాల మధ్యమెటల్ సెక్టార్ నాలుగు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోవటంతో సెంటిమెంట్ బలహీనంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయగానూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సింగపూర్ ఔన్స్ బంగారం ధర 0.61 శాతం నష్టంతో1,310.10 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.37 శాతం తగ్గి 16.28 డాలర్లకు చేరుకుంది.