మార్కెట్‌ ర్యాలీ..?

FPI surcharge removal, stimulus measures likely to boost markets - Sakshi

ఎఫ్‌పీఐ సర్‌చార్జ్‌ ఉపసంహరణతో మార్కెట్‌కు జోష్‌..

సోమవారం గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌కు అవకాశం..

క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం వెల్లడి

ఈ వారంలోనే ఆగస్టు సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంపై ఇన్వెస్టర్ల దృష్టి

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌కు జోష్‌ వచ్చే అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం సానుకూల అంశంగా ఉందని చెబుతున్నాయి.

సర్‌చార్జ్‌ అంశం ఇటీవల దేశ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా నష్టపరచగా.. ఈ కీలక అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంచేయడంతో మళ్లీ ఎఫ్‌పీఐల పెట్టుబడి భారత క్యాపిటల్‌ మార్కెట్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ ఫండమెంటల్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ రస్మిక్‌ ఓజా విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారక విలువ బలపడేందుకు కూడా ప్రభుత్వ తాజా నిర్ణయం దోహదపడనుందని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్‌పీఐల అమ్మకాల ప్రవాహం ఆగిపోయి.. కొనుగోళ్లు జరిగేందుకు అవకాశం ఉంది.

ఇక్కడ నుంచి మార్కెట్‌ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. అయితే, ఈ ర్యాలీ కొనసాగాలంటే.. కంపెనీల ఆదాయ వృద్ధి పుంజుకుని, ఆర్థిక వ్యవస్థలో మందగమనం తొలగిపోవాలి’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వి.కె.విజయ్‌ కుమార్‌ అన్నారు. భారత జీడీపీలో వృద్ధి వేగంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి భరోసా, ఎఫ్‌పీఐ సర్‌చార్జ్‌ ఉపసంహరణ వంటి కీలక అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్‌ గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌కు చాన్స్‌ ఉందని ట్రేడింగ్‌ బెల్స్‌ కో–ఫౌండర్, సీఈఓ అమిత్‌ గుప్తా  చెప్పారు.  

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు మద్దతు..!
ఆర్థిక వ్యవస్థలో రుణ మంజూరీని పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు)కు అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. ఈ తాజా అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు కొనుగోలు మద్దతు లభించే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ విశ్లేషకులు గరిమా కపూర్‌ అన్నారు.

ఇక ఆటో రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు సవరణను 2020 జూన్‌ వరకు వాయిదా వేయడం వంటి పలు ప్రోత్సాహక నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ అంశానికి తోడుగా.. వస్తు, సేవల పన్ను ఊరట లభిస్తే ఆటో రంగ షేర్లలో పతనం ఆగుతుందనేది దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల అంచనా. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసిక (జూలై–సెప్టెంబర్‌) జీడీపీ అంచనాల గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది.

అంతర్జాతీయ అంశాల ప్రభావం..
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలకు ధీటుగా చైనా సవాలు విసురుతోంది. ఇటీవల చైనా దిగుమతులపై 10% సుంకం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. మొత్తం 75 బిలియన్‌ డాలర్ల విలువగల యూఎస్‌ వస్తువులపై అదనంగా 10% టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్‌ అదేరోజున మరోసారి తీవ్రంగా స్పందించారు. చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించడంతో పాటు ఆదేశం నుంచి అమెరికన్‌ కంపెనీలు బయటకు వచ్చేయాలని కోరారు. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఆరోజున భారీ నష్టాలను చవిచూశాయి. నాస్‌డాక్‌ ఏకంగా 3% నష్టపోయింది.

ఆగస్టులో రూ.3,014 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1–23 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.12,105 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్‌ మార్కెట్‌లో రూ.9,091 కోట్లను పెట్టుబడి పెట్టారు.   దీంతో క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,014 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌పీఐ లపై కేంద్ర ప్రభుత్వం సర్‌చార్జ్‌ ఉపసంహరణతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్‌ చందోక్‌ అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసాతో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్‌ విశ్లేషించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top