అమ్మకాల షాక్- 5 రోజుల ర్యాలీకి బ్రేక్
మిడ్సెషన్ నుంచీ ట్రెండ్ రివర్స్
సెన్సెక్స్ 346 పాయింట్లు పతనం
36,329 పాయింట్ల వద్ద ముగింపు
94 పాయింట్లు డౌన్-10,706కు నిఫ్టీ
పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ జోరు
ఆటో, ఐటీ, రియల్టీ, మీడియా డౌన్
చివరి గంటలో ఉన్నట్టుండి తలెత్తిన అమ్మకాలు స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 346 పాయింట్లు పతనమై 36,329 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 10,706 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా తొలుత దేశీ మార్కెట్లు స్వల్ప స్థాయిలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. తదుపరి మిడ్సెషన్కల్లా బలపడినప్పటికీ చివర్లో అనూహ్యంగా అమ్మకాలు ఊపందుకోవడంతో డీలాపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,828 వద్ద గరిష్టాన్ని చేరగా.. 36,234 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,848-10,677 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. యూరోపియన్ మార్కెట్లు 0.6-1 శాతం మధ్య నష్టాలతో ప్రారంభంకావడం, ఐదు రోజుల ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు మార్కెట్లకు షాకిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
ఎఫ్ఎంసీజీ, ఫార్మా ప్లస్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ, రియల్టీ, మీడియా రంగాలు 2-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. పీఎస్యూ బ్యాంక్స్ 2.3 శాతం బలపడగా.. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు 1.6-0.7 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, జీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్, ఇన్ఫోసిస్, టైటన్ 4.6-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఇండస్ఇండ్, వేదాంతా, జేఎస్డబ్లూ స్టీల్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, హెచ్యూఎల్, ఐటీసీ, టాటా స్టీల్, ఐవోసీ 4.5-1 శాతం మధ్య లాభపడ్డాయి.
సెయిల్ , నాల్కోజోరు
డెరివేటివ్ కౌంటర్లలో కమిన్స్, బాలకృష్ణ, డీఎల్ఎఫ్, జూబిలెంట్ ఫుడ్, టీవీఎస్ మోటార్, చోళమండలం, బంధన్ బ్యాంక్, ఈక్విటాస్ 5-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. సెయిల్, నాల్కో, శ్రీరామ్ ట్రాన్స్, టాటా కన్జూమర్, మెక్డోవెల్, కెనరా బ్యాంక్, బీవోబీ, అరబిందో, 8.5-3.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1514 నష్టపోగా.. 1244 లాభపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్, ఒమాక్సే, బ్రిగేడ్, సన్టెక్ 5-4 శాతం మధ్య పతనమయ్యాయి.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 348 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు