ఈపీఎఫ్ఓ వడ్డీరేట్లు కోత... కానీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లు ఈ ఏడాది తమ రిటైర్మెంట్ కార్పస్లపై తక్కువ వడ్డీరేట్లు పొందనున్నారు. గతేడాది 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఈ ఏడాది 8.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు నవంబర్ 23న ప్రభుత్వ బోర్డు ట్రస్టీలు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ భేటీ కాబోతుందని అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రావిడెంట్ ఫండ్ తగ్గినప్పటికీ, మొత్తం రిటర్నులు ఎక్కువగానే పొందనున్నట్టు తెలుస్తోంది. వీటిని ఈక్విటీ పెట్టుబడులకు తరలించడం దీనికి గల ప్రధాన కారణమని సీనియర్ అధికారి చెప్పారు. ఈ ఏడాది ఈపీఎఫ్ఓ 15 శాతం తన కార్పస్ను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల ద్వారా ఈక్విటీలో పెట్టుబడులుగా పెట్టిందని తెలిసింది. దీని ద్వారా ఆర్జించిన మొత్తాలను సబ్స్క్రైబర్ షేరు కింద వారి పీఎఫ్ అకౌంట్లోకి యూనిట్ల రూపంలో జమచేయాలని ప్రతిపాదించింది.
ఎప్పుడైతే పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటారో అప్పుడు సబ్స్క్రైబర్ ఆ యూనిట్లను రిడీమ్ చేసుకునే అవకాశముంటుంది. దీంతో సబ్స్క్రైబర్ పొందే మొత్తం ఆదాయం ఈటీఎఫ్ మార్కెట్ ధరపై ఆధారపడిన యూనిట్ల లాభాలు, డెట్లో పెట్టుబడులుగా పెట్టిన ఫండ్ వడ్డీరేట్లు కలిసి ఉండనున్నాయి. చాలా వరకు పీఎఫ్ కార్పస్ను ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులుగా పెడతారు. పాత స్థాయిల్లో వడ్డీరేట్లను కొనసాగించడం చాలా కష్టతరమని, 20 ఏళ్ల సెక్యురిటీల మెచ్యూరిటీ తీరిపోతుండటంతో, కొత్త సెక్యురిటీలను తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్టు అధికారి తెలిపారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ కార్పస్లపై వడ్డీరేట్లు తగ్గున్నట్టు పేర్కొన్నారు. గతేడాదే అంతకముందున్న పీఎఫ్ వడ్డీరేట్లను 8.8 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 4.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు.