ప్రవాసీలకు దేశీయంగా సేవలు@ ఎన్నారైహితడాట్కామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు దేశీయంగా అవసరమయ్యే సేవలు అందించే దిశగా కొత్త స్టార్టప్ సంస్థ ఎన్నారైహితడాట్కామ్(WWW. NRIHITA. COM) కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ద్వారా ప్రాపర్టీ మేనేజ్మెంట్, న్యాయసేవలు మొదలుకుని కంపెనీల రిజిస్ట్రేషన్, బిల్లుల చెల్లింపులు, కొరియర్ సర్వీసుల దాకా పలు సర్వీసులు అందించనున్నట్లు శుక్రవారం పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సీఈవో రాజిరెడ్డి కేశిరెడ్డి తెలిపారు.
ఎన్నారైలపై ఆధారపడి ఉండే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సంరక్షణ సేవలు కూడా అందిస్తామని ఆయన తెలియజేశారు. అత్యంత చౌకగా పది డాలర్ల నుంచి తమ సర్వీసులు పొందవచ్చని, తొలుత హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఎన్నారైలు గతేడాది భారత్కు దాదాపు రూ.4,03,200 కోట్ల మేర రెమిటెన్సులు జరిపారని.. ఇది ఏయేటికాయేడు పెరుగుతూనే ఉందని రాజిరెడ్డి చెప్పారు. అయితే, చాలా సందర్భాల్లో ఇక్కడి పనుల పర్యవేక్షణకు అవసరమైన సహాయం సమయానికి దొరక్క ప్రవాసీలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారని, దీన్ని పరిష్కరించేందుకే ఎన్నారైహితడాట్కామ్ను ప్రారంభించినట్లు తెలియజేశారు. ఇప్పటికే తమ యాడ్నిగమ్డాట్కామ్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు